కృష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. శంకుస్థాపనలో భాగంగా గంగమ్మకు సీఎం పూజలు నిర్వహించిన ఆయన....పోర్టు నిర్మాణంతో జిల్లా ముఖచిత్రం మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్ను ఆవిష్కరించారు.
24-30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం
35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్ కంటైనర్తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24-30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పోర్టు పనులు పూర్తయిన తరువాత 25వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే కొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.
ఎగుమతులకు వేదికగా...
మచిలీపట్నం పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారుతుందన్నారు.
నాలుగేళ్లలో నాలుగు పోర్టులు
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 5వేల 156 కోట్ల రూపాయిల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టుకు ఇప్పటికే భూసేకరణ చేసి, అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలు పరిష్కరించి, టెండర్లు ఫైనలైజ్ చేసి, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసి పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళలో కేవలం 6 పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం 4 ఏళ్ళలోపే 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు సిఎం వివరించారు. ఇప్పటికే రామాయపట్నంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని, మూలపేట పోర్టు పనులు కూడా ఇప్పటికే ప్రారంభించామని, కాకినాడ గేట్ వే పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, బందరు ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ మచిలీపట్నం పోర్టు పనుల్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు.
నిర్మాణానికి ప్రత్యేక సంస్థ ఏర్పాటు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020, ఫిబ్రవరి 4 న మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్ధ ఏర్పాటు చేసి పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతుల మంజూరు చేసినట్లు తెలిపారు. 2023, ఫిబ్రవరి 28న పర్యావరణ అనుమతులు, 2023 ఏప్రిల్13 న కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల మంజూరు, 2023 మార్చి నెలలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తైనట్లు వివరించారు.
నాలుగు పోర్టులు అభివృద్ది
ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా 974 కిలో మీటర్ల తీరంతో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరంగల రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా ఏపీ మారిటైమ్ బోర్డు నాలుగు పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్ పోర్టు, ఐదు నాన్ మేజర్ పోర్టుల ద్వారా ఏటా 320 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉంది. అలాగే..కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ప్రతీ 50 కి.మీకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు ఉండేలా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వీటిద్వారా 2035 నాటికి రాష్ట్ర సముద్ర వాణిజ్య విలువ 20 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మార్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయనున్నారు.
మచిలీపట్నం పోర్టు విశేషాలు..
* భూసేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,155.73 కోట్లు
* వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్ టన్నులు
* బెర్తుల సంఖ్య 4
* భూసేకరణ.. 1,923 ఎకరాలు
* ఎన్హెచ్ 216ను అనుసంధానం చేస్తూ 6.5 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి
* పెడన రైల్వేస్టేషన్ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం
* బందరు కెనాల్ నుండి 11 కి.మీ పైప్లైన్ ద్వారా 0.5 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి సరఫరా
* పెడన 220 కేవీ సబ్స్టేషన్ నుండి 15 ఎంవీఏ (మెగా వోల్ట్ యాంప్) విద్యుత్ సరఫరా