బంగారు తెలంగాణలా.. బంగారు భారతదేశం తయారు చేసుకుందామన్నారు సీఎం కేసీఆర్. నారాయణ ఖేడ్ లో సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల పథాకానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. 14 ఏళ్లు కొట్లాడిన తర్వాత చివరకు దీక్ష చేపట్టి సావునోట్లకు పోయి వచ్చాక తెలంగాణ ప్రకటించారన్నారు. పట్టుబట్టి తెలంగాణను సాధించుకున్నామన్నారు. రాష్ట్రం రాకముందు ఎంతో మంది హేళనగా మాట్లాడారన్నారు కేసీఆర్.
దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. శాశ్వతంగా మంచినీళ్ల బాధను తొలగించామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్ అని అన్నారు. వ్యవసాయం రంగంలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టును శంకుస్థాపన చేశామన్నారు. అందరు కలిసి సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలన్నారు. ఆందోళ్ నియోజవర్గం సస్యశ్యామలం కాబోతుందన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీకి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు కేసీఆర్.
మండల కేంద్రంగా నిజాంపేట
సంగారెడ్డి, జహిరాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్ల చొప్పున మంజూరు చేస్తామన్నారు కేసీఆర్. వీటికి సంబంధించిన జీవోను రేపే రిలీజ్ చేస్తామన్నారు. మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని 699 గ్రామాలకు రూ. 20 లక్షల చొప్పున రిలీజ్ చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని తండాలకు రోడ్లు వేయిస్తామన్నారు. నిజాంపేటను మండల కేంద్రంగా చేస్తామన్నారు. కొందరు కులాలు,మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గజ్వేల్, సిద్ధిపేట కన్నా ఎక్కువ నీళ్లు ఇవాళ ఆందోళ్ కు వస్తున్నాయన్నారు కేసీఆర్.
బంగారు భారత దేశం తయారు చేద్దాం
ఎట్లయితే తెలంగాణను బాగు చేసుకున్నామో..మన దేశాన్ని అలాగే చేసుకోవాలన్నారు కేసీఆర్. దేశరాజకీయాల్లో తాము కీలక పాత్ర పోషించబోతున్నామన్నారు . అందరు అమెరికాకు పోవడం కాదు..అమెరికా విద్యార్థులే వీసా తీసుకొని ఇండియాకు రావాలన్నారు. భారత దేశంను అమెరికా కన్నా గొప్ప దేశంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి పోతున్నానని.. బంగారు తెలంగాణను ఎలాగ తయారు చేసుకున్నామో.. బంగారు భారత దేశం అట్లాగే తయారు చేసుకుందామన్నారు కేసీఆర్.