రాజకీయ పోరు రసవత్తరంగా .. దూకుడు పెంచిన పార్టీలు

రాజకీయ పోరు రసవత్తరంగా .. దూకుడు పెంచిన పార్టీలు
  •     ఏకగ్రీవ తీర్మానాలతో బీఆర్ఎస్
  •     ఎమ్మెల్యేల ప్రవాస్​ యోజనతో బీజేపీలో జోష్​ 
  •     గడపగడపకు కాంగ్రెస్ తో ప్రజల్లోకి వెళ్తున్న శ్రేణులు ​
  •     కేసీఆర్​ పోటీతో ప్రతిపక్షాల అలర్ట్​

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలో ఉండడంతో రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. అధికార బీఆర్ఎస్ తో పాటు​ బీజేపీ, కాంగ్రెస్​తమ స్పీడ్​పెంచాయి. స్వయంగా ముఖ్యమంత్రే పోటీ చేయనుండడంతో ప్రతిపక్షాలు మరింత అలర్టయ్యాయి. నియోజకవర్గవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మధ్య ఉంటున్నాయి.

అధికార బీఆర్ఎస్..

పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో అధికార బీఆర్ఎస్​ హడావుడి చేస్తోంది. కేసీఆర్ ​పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో ఆయా గ్రామాల మద్దతు కూడగట్టేందుకు ఆ పార్టీ లీడర్లు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మాచారెడ్డి మండలంలో ఎనిమిది గ్రామాలు, పాల్వంచ మండలంలోని ఓ గ్రామంలో కేసీఆర్​కు మద్దతుగా పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. 

2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, పాతతరం నేతల వివరాలు ఆరా తీస్తున్నారు. వారి నుంచి మద్దతు కోరుతున్నారు. కామారెడ్డిలో వారం రోజుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి మీటింగ్​ నిర్వహించనున్నారు.

బీజేపీ ఫోకస్..​

కామారెడ్డి నియోజకవర్గంపై బీజేపీ స్పెషల్​ ఫోకస్​పెట్టింది. ఇక్కడి నుంచి బరిలో నిలవాలని భావిస్తున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చాలాకాలంగా పార్టీ క్యాడర్​ను మెయిం​టేన్​ చేస్తున్నారు. సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల మధ్య ఉంటున్నారు. ఆయా కులసంఘాల భవనాలకు, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు తన సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. మండల, నియోజకవర్గ స్థాయి మీటింగ్​లు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులు యాక్టివ్​గా ఉండేలా చూస్తున్నారు. వారం రోజులుగా నియోజకవర్గంలో కొనసాగిన ఎమ్మెల్యే ప్రవాస్ ​యోజన ప్రోగ్రామ్ తో క్యాడర్​లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

చేరికలపై కాంగ్రెస్​ నజర్​

కామారెడ్డి నుంచి తానే బరిలో ఉంటానని ప్రకటించిన షబ్బీర్​అలీ కొంత కాలంగా యాక్టివ్​గా ఉన్నారు. గడప గడపకు కాంగ్రెస్​ప్రోగ్రామ్​తో ప్రజల మధ్యకు వెళ్తూ అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను వివరిస్తున్నారు. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న లీడర్లను కాంగ్రెస్​లో చేరేలా చూస్తున్నారు. ఇటీవల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల మీటింగ్​ నిర్వహించారు. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తామని పార్టీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.