సూర్యాపేటలో కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్

సూర్యాపేటలో కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్

సూర్యాపేటలో సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా రూ.500 కోట్ల వ్యయంతో చేపడుతున్న మెడికల్‌ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభించారు. అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణమైన ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మార్కెట్‌లో కాసేపు కలియతిరిగి దాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా నూతన బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. 

అక్కడి నుంచి నేరుగా రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు వెళ్లారు. జిల్లా ఎస్పీ ఆఫీసును ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 

అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో సమావేశం అనంతరం సూర్యాపేట నూతన మార్కెట్‌ సమీపంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వెళ్లారు.