ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర

ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర
  • కుటుంబం కోసం కేసీఆర్​ రాజకీయ 
  • బేరసారాలకు దిగిండు: సీఎం రేవంత్​రెడ్డి
  • ఈ రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి వెళ్తే మధ్యయుగాలనాటి పరిస్థితులే
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
  • గెలుపు కోసం స్థాయి మరిచి మోదీ ఆరోపణలు చేస్తున్నరు
  • సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నం.. ఇది దేశ మనుగడకే ప్రమాదం
  • ‘మీట్​ ది ప్రెస్’​లో సీఎం వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు కేసీఆర్​ కుట్రలు చేస్తున్నా రని, ఇప్పటికే రాజకీయ బేరసారాలు మొదలు పెట్టారని సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకవేళ ఈ రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి వెళ్తే విశ్వనగరంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్​కు జరిగే నష్టం ఊహలకు కూడా అందదు. ఎన్నికల్లో గెలవడానికి మతాలు, వ్యవస్థలు, వ్యక్తుల మధ్య విషం చిమ్మడం అనే బీజేపీ విధానం తెలంగాణ సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశించకుండా నిలువరించాలన్న ఆలోచనతో ఎన్నికల్లో బరిగీసి కొట్లాడుతున్నం” అని ఆయన తెలిపారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంతో మంది త్యాగాలున్నాయి. కానీ, ఆ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి రాజకీయపార్టీని విస్తరించుకొని.. తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు. దీంతో విసుగెత్తిన తెలంగాణ ప్రజలు ఆ కుటుంబ పార్టీని గద్దె దింపిన్రు. ఇది తట్టుకోలేని ఆ పార్టీ ఇప్పుడు ఆ కుటుంబం కోసం వ్యూహాత్మకంగా ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించాలని కుట్ర చేస్తున్నది. రాజకీయ బేరసారాల్లో భాగంగా బీజేపీతో ఇప్పటికే సన్నాహక సమావేశాలు పూర్తిచేసింది’’ అని ఆరోపించారు. హైదరాబాద్​లో శుక్రవారం రాత్రి జరిగిన ‘మీట్​ది ప్రెస్​’లో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. 

2014, 2019 ఎన్నికల తర్వాత రెండుసార్లు అధికారం చేపట్టిన బీజేపీ, ఎన్డీఏ కూటమి .. క్రమక్రమంగా సంస్థలను, వ్యవస్థలను, వ్యక్తులను అన్నింటినీ చెరపట్టిందని మండిపడ్డారు. ‘‘ఇప్పుడు ప్రధాని మోదీ  రాజ్యాంగాన్ని మారుస్తాం.. రిజర్వేషన్లను రద్దు చేస్తామనే బరితెగింపునకు దిగుతున్నడు. వీళ్ల నుంచి రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు, ప్రజలకు స్వేచ్ఛనిచ్చేందుకు రాహుల్​గాంధీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నం’’ అని ఆయన తెలిపారు. 

బీజేపీ రాష్ట్రాల్లో అభివృద్ధి ఏది?

‘‘బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. ఉదాహరణకు వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్ ను తీసుకుంటే.. ఆ రాష్ట్రం ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.  అక్కడి పరిపాలన విధానం, శాంతిభద్రతల సమస్య, బీజేపీ వ్యవహారశైలే ఇందుకు కారణం. కానీ.. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్​, బీఆర్ఎస్​ ఇలా ఎవరు అధికారంలో ఉన్నా, పార్టీల మధ్య సిద్ధాంతపరంగా వైరుధ్యాలున్నా, పరిపాలనా విధానంలో భిన్నాభిప్రాయాలున్నా.. ఏనాడూ హైదరాబాద్​సిటీలో మతాల మధ్య, వ్యక్తుల మధ్య  విద్వేషాలు సృష్టించలేదు. అలాంటి పాలన అందించడం వల్లే చారిత్రక హైదరాబాద్​ నగరం ప్రపంచంలో పెట్టుబడులకు గమ్యస్థానంలా మారింది” అని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఒకవేళ తెలంగాణ, హైదరాబాద్​ బీజేపీ చేతిలోకి పోతే ఆ నష్టం ఊహలకు అందదని ఆయన అన్నారు. ‘‘కేసీఆర్​ వందేండ్లకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సమాజవిధ్వంసం కాదు. కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజమే నిట్టనిలువునా చీలిపోయి, మధ్యయుగాలనాటి పరిస్థితులు వస్తాయి” అని తెలిపారు. 

అధికారం కోసం మోదీ ఎంతకైనా తెగిస్తడు

అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మోదీ ఎంతకైనా తెగిస్తారని సీఎం రేవంత్​మండిపడ్డారు. ‘‘ఎన్నికలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతున్న మాటలే ఇందుకు నిదర్శనం. 2019 ఎన్నికల టైంలో మాజీ ప్రధాని మనోహన్​సింగ్ పై​ మోదీ తీవ్రమైన ఆరోపణల చేసిండు. పాకిస్థాన్​తో ఒప్పందం చేసుకొని సుఫారీ ఇచ్చి, ఈ దేశ ప్రధానిని చంపేందుకు కుట్ర చేసిండని అన్నడు. కానీ, ఎన్నికల తర్వాత ఎందుకు విచారణ జరిపించలే? ఇప్పుడు కాంగ్రెస్​పార్టీ మీద, రాహుల్​మీద ఇలాంటి ఆరోపణలే చేస్తున్నడు. రెండు ఇండ్లు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటరని, ఆస్తులను దోచుకుంటరని, తాళిబొట్లను ఎత్తుకెళ్తారని ఆరోపిస్తున్నడు. ఒక ప్రధాని తన స్థాయిని మరిచి ఇలాంటి మాటలు మాట్లాడడం, ప్రజల  మనస్సుల్లో విద్వేషం నింపడం ఏంది? ఈ సమాజాన్ని చీల్చడం ద్వారా ఎన్నికల్లో నెగ్గాలనుకునే కుట్ర ఈ దేశ మనుగడకే ప్రమాదం’’ అని ఆయన అన్నారు. మోదీ, బీజేపీ తీరు వల్ల దేశం చిన్నచిన్న సంస్థానాలుగా విడిపోవడానికి దారి తీస్తుందని తెలిపారు. ‘‘ఇప్పటికే రాజకీయంగా, ఆర్థికంగా, అభివృద్ధిపరంగా ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య అంతరం పెరుగుతున్నది. గుజరాత్​నుంచి 26 ఎంపీలుంటే ఏడు మంత్రి పదవులు ఇచ్చిండు. ఉత్తరప్రదేశ్​కు 12 కీలకమైన మంత్రి పదవులు ఇచ్చిండు. కానీ, అత్యధిక ప్రజలు మాట్లాడే రెండో అతి పెద్ద భాష అయిన తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది ప్రజాప్రతినిధులు ఉంటే కేవలం ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చిండు. తెలంగాణ నుంచి రూపాయి పన్ను చెల్లిస్తే 43 పైసలు రిటర్న్ ఇస్తున్నడు. అదే  బిహార్ కు​ ఉల్టా 7.6 రూపాయలు ఇస్తున్నడు. ఆనాటి పాలకుల పిలుపు మేరకు ఫ్యామిలీ ప్లానింగ్​ద్వారా దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గింది. కానీ, బీజేపీ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చూస్తున్నది. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది’’ అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘మోదీ చెప్తున్న ‘వన్​ నేషన్​వన్​ ఎలక్షన్’ ఫార్ములాతో ఆయన తరహా వ్యక్తి కేంద్రీకృత పాలనతో దేశానికి తీరని నష్టం జరుగుతుంది. అందువల్ల ప్రజలు, విజ్ఞులు, పౌరహక్కుల కోసం కొట్లాడేవాళ్లంతా  చైతన్యంతో కదిలి ఓటు హక్కుతో బీజేపీకి బుద్ధి చెప్పాలి. హాలిడేస్​వచ్చాయని ఓటేసేందుకు కాకుండా విహారయాత్రలకు వెళ్తే మన మనుగడే ప్రమాదంలో పడ్తుంది” అని సీఎం పేర్కొన్నారు.

జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ సమాధానాలివీ..

ప్రశ్న: పార్లమెంట్​ఎన్నికలపై కాంగ్రెస్ విధానం ఏంటి?

రేవంత్: రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన లోక్​సభ ఎన్నికలన్నీ అభివృద్ధి, సంక్షేమం చుట్టూ నడిచాయి. ప్రస్తుతం అవి పక్కకు వెళ్లాయి. రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్, బైబిల్. బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడేలా రాజ్యాంగ రచన జరిగింది. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్ విధివిధానాలను రూపొందించింది. రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీతో మేం అధికారం కోసం కొట్లాడడం లేదు. మేం ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను కాపాడేందుకు పోరాడుతున్నాం.  

బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తదని ఎట్ల చెబుతరు? 

ఆర్ఎస్ఎస్​వందేండ్లు పూర్తి చేసుకుంటున్నది. 2025 నాటికి రిజర్వేషన్ల రద్దు అనేది కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలోనే ఉంది. దాని ఎజెండాలో చివరివి అయిన రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల ఎత్తివేతను ఈసారి అమలు చేసేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతున్నది. మోదీ అధికారంలో వచ్చాక జనాభా లెక్కలు నిర్వహించలేదు. బీసీ కులగణనను మేం అడిగినం.. కానీ చేయలేదు. దీని ఉద్దేశం రిజర్వేషన్ల రద్దే. ఈ అంశాన్ని నేను ఇక్కడి నుంచి ఒక నేషనల్ ఇష్యూగా మార్చాను. అది బీజేపీకి మింగుడుపడడం లేదు. నేను సృష్టించిన సునామీకి మోహన్ భగవత్ ఇక్కడికి వచ్చి ఏదో సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేసిండు. మోదీ విమర్శలు చేసిండు. అమిత్ షా నా మీద, మా మనుషుల మీద కేసులు పెట్టిండు. ఇప్పటికీ 200 మంది ఢిల్లీ పోలీసులు రాష్ట్రంలో ఉన్నారు. మా కార్యకర్తలను వేధిస్తున్నారు. రిజర్వేషన్ల రద్దు అంశం బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఈసీ కాకుండా కేంద్ర హోంశాఖ నాపై ఎందుకు చర్యలకు సిద్ధమైంది. 

మోదీ, కేసీఆర్ లలో ఎవరు టఫ్?

స్టేట్​యాంగిల్ లో చూస్తే కేసీఆర్ టఫ్. బీజేపీ వాళ్లు ఇక్కడ విజిటింగ్ ప్రొఫెసర్ మాత్రమే. రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు కుట్ర జరుగుతోంది. బీజేపీకి లాభం చేకూర్చే విధంగా బీఆర్ఎస్​ వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ కనిపిస్తున్నా ఇద్దరి మధ్య మాత్రమే పోటీ ఉంది. బీఆర్ఎస్​ ఎన్నికలను వదిలేసింది. ఆ పార్టీ కనీసం ఆరు సీట్లలో డిపాజిట్​ కోల్పోతుంది. 

రాజకీయ నాయకులు భాష మార్చుకోరా?

ఇపుడు నేను ఎన్నికల ఆటలో ఉన్న. ఆయన (కేసీఆర్) మాటలను బట్టి నా రిప్లై ఉంటది. లేకపోతే ఆటలో వెనకబడ్త. ఈ ఆటకు, భాషకు ఆద్యుడు అతడే. ఇలాంటివి వద్దనుకుంటే పెద్ద మనుషుల ఒప్పందానికి నేను సిద్ధం. ఒక కాగితం మీద సంతకం పెట్టి దానికి ఫుల్ స్టాప్ పెడదాం. 

కృష్ణా జలాలపై కేసీఆర్ చేస్తున్న విమర్శలపై ఏమంటరు? 

నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కృష్ణా జలాలపై కేసీఆర్​రోజుకో మాట మాట్లాడుతున్నరు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అన్ని అబద్ధాలే చెబుతున్నరు. కృష్ణా జలాల్లో రాష్ట్రం హక్కులను పరిరక్షిస్తాం.  

కంపెనీలను గుజరాత్​కు తరలించే కుట్ర జరిగిందా?

కంపెనీలను గుజరాత్​కు తరలించే కుట్ర చేస్తున్నారు. కొన్ని సంస్థలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. టెస్లా కంపెనీకి అదే పరిస్థితి ఎదురైంది. గుజరాత్​కు పెట్టుబడులు వచ్చినట్టే తెలంగాణకు రావాలి.   

చంద్రబాబు, రేవంత్​ఒక్కటేనని జగన్ అంటున్నారు కదా? 

ఏపీ సీఎం జగన్ మాటలు ఎవరూ నమ్మడం లేదు. ఆయనను సొంత తల్లి, చెల్లి నమ్మడం లేదు. జగన్​తన కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటే మంచిది. 

రుణమాఫీకి కట్టుబడి ఉన్నారా? 

తప్పకుండా రుణమాఫీ చేస్తాం. మే 9లోపే రైతుభరోసా నిధులు వేస్తామని చెప్పాం.. వేశాం. పంద్రాగస్టులోగా రూ.2లక్షల మాఫీ చేస్తామని ప్రకటించాం. దానికి కట్టుబడి ఉన్నాం.

  • కేసీఆర్​ వందేండ్లకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సమాజ విధ్వంసం కాదు. కానీ, రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజమే నిట్టనిలువునా చీలిపోయి, మధ్యయుగాలనాటి పరిస్థితులు వస్తాయి.
  • బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్​ను తీసుకుంటే.. ఆ రాష్ట్రం ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.  అక్కడి పరిపాలనా విధానం, శాంతిభద్రతల సమస్య, బీజేపీ వ్యవహారశైలే అందుకు కారణం. - సీఎం రేవంత్​రెడ్డి