
- ఇచ్చిన మాట ప్రకారం రూ. కోటి చొప్పున అందజేసిన సీఎం రేవంత్రెడ్డి
- అందుకున్నవారిలో అందెశ్రీ, ఎక్కా యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాశం యాదగిరి
- దివంగత గద్దర్, గూడ అంజయ్య తరఫున స్వీకరించిన కుటుంబ సభ్యులు
- విదేశాల్లో ఉన్న గోరటి వెంకన్న తరఫున అందుకున్న కూతురు
- నలిమెల భాస్కర్కు కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన 9 మంది కళాకారులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులకు సీఎం రేవంత్రెడ్డి కోటి రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం వారికి వీటిని అందజేసి సత్కరించారు. నిరుడు డిసెంబర్ 9న సెక్రటేరియెట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ నగదు పురస్కారాలను సీఎం ప్రకటించారు. చెప్పినట్టుగానే అందజేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందెశ్రీ, ఎక్కా యాదగిరి, సుద్దాల అశోక్తేజ, జయరాజ్, పాశం యాదగిరి చెక్కులు అందుకోగా.. దివంగత గద్దర్, గూడ అంజయ్య తరఫున వారి కుటుంబసభ్యులు చెక్కులు స్వీకరించారు.
విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరఫున ఆయన కూతురు చెక్కును అందుకున్నారు. కాగా, బండి యాదగిరికి రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి నగదు పురస్కారం ప్రకటించినా.. ఆయన కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఇవ్వలేదు. మరోరోజు వారికి నగదు పురస్కారం అందజేయనున్నది. నలిమెల భాస్కర్కు కాళోజీ సాహిత్య పురస్కారాన్ని సీఎం రేవంత్ అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 19 మంది పోలీస్ అధికారులకు ‘మెడల్ ఫర్ గ్యాలంట్రీ’, 11 మందికి ‘మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ అవార్డులను ఆయన అందించారు.
ఆ తొమ్మిది మంది వీరే..!
గద్దర్: ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచిన గుమ్మడి విట్టల్ రావు (గద్దర్) 1949లో మెదక్ జిల్లా తూప్రాన్లో జన్మించారు. కవి, గాయకుడు, కమ్యూనిస్ట్ విప్లవకారుడిగా తెలంగాణ ఉద్యమంలో చైతన్యం కలిగించారు. ఆయన నుంచి వెలువడిన “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా” పాట ఉద్యమ బావుటాగా నిలిచింది. ఇంజనీరింగ్ చదువుతూ దళిత పాంథర్స్, నక్సల్బరీ ఉద్యమాల ప్రభావంతో 2010 వరకు విప్లవ ఉద్యమంలో కొనసాగి, తర్వాత అంబేద్కరైట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. --గద్దర్ 2023లో కన్నుమూశారు.
గూడ అంజయ్య: ఆదిలాబాద్ జిల్లా లింగాపురంలో 1955లో జన్మించిన జానపద గేయ కవి గూడ అంజయ్య. ఆయన రాసిన “ఊరు మనదిరా” పాట 16 భాషల్లో అనువాదమైంది. “అయ్యోనివా... అవ్వోనివా”, “ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా” పాటలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ‘పొలిమేర’ (నవల), ‘దళిత కథలు’ (కథా సంపుటి) రచించారు. ఆయన ప్రసిద్ధ పాటలు: “నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు”, “రాజిగా ఓరి రాజిగా”, “తెలంగాణ గట్టుమీద సందమామయ్యో”వంటివి ఉన్నాయి. గూడ అంజయ్య --2016లో కన్నుమూశారు.
అందెశ్రీ: వరంగల్ జిల్లా రేబర్తిలో 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ”ను రచించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. అశు కవిత్వంలో దిట్ట. “పల్లెనీకు వందానాలమ్మో”, “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు” పాటలు ప్రసిద్ధం.
గోరటి వెంకన్న: నాగర్కర్నూల్ జిల్లా, గౌరారంలో 1963లో జన్మించారు. ఆయన “వల్లంకి తాళం” పుస్తకానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. “నీ పాట ఏమాయెరో”, “జై భోలో అమరవీరులకు”, “పల్లె కన్నీరు పెడుతుందో”, “పూసిన పున్నమి వెన్నెలలోన తెలంగాణ వీణ” పాటలు ప్రజలను ఉత్తేజపరిచాయి. రచనలు: ‘ఏకనాదం మోత’, ‘రేల పూతలు’, ‘అల చంద్రవంక’, ‘పూసిన పున్నమి’, ‘వల్లంకి తాళం’.
సుద్దాల అశోక్ తేజ: 1960లో యాదాద్రి భువనగిరి జిల్లా, సుద్దాలలో జన్మించారు. సుద్దాల హన్మంతు వారసుడై, 2000కుపైగా సినిమాల్లో 3000కుపైగా పాటలు రాశారు. “నేను సైతం” (ఠాగూర్, 2003) పాటకు 2014లో జాతీయ గీత రచయిత అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి, “శ్రీ శూద్ర గంగా” వచన కావ్యం రచించారు.
జయరాజు: మహబూబాబాద్ జిల్లా గుమ్మనూర్లో జన్మించి, ఖమ్మం జిల్లా గంధంపల్లిలో చదువుకున్నారు. సింగరేణిలో ఫిట్టర్గా చేరి, కార్మిక సమస్యలపై జైలుకు వెళ్లారు. కవి, గాయకుడు, ఉద్యమకారుడిగా 2023లో కాళోజీ సాహిత్య పురస్కారం అందుకున్నారు.
పాశం యాదగిరి: 1952లో హైదరాబాద్ గౌలిగూడలో జన్మించారు. ఆయన సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు, తెలంగాణ ఉద్యమకారుడు. పత్రికా రంగంలో ప్రత్యేక ముద్ర వేశారు.
ఎక్కా యాదగిరిరావు: హైదరాబాద్ పాతబస్తీలో జన్మించిన శిల్పి, చిత్రకారుడు. తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం రూపొందించి, పద్మశ్రీ గ్రహీతగా గుర్తింపుపొందారు. ‘మిథున’ శిల్పంతో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి సాధించారు.
నలిమెల భాస్కర్కు కాళోజీ సాహిత్య పురస్కారం
బహు బాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారాన్ని సీఎం రేవంత్రెడ్డి అందజేశారు. 1956 ఏప్రిల్ 1 న రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట్ మం డలం నారాయణపూర్లో నలిమెల భాస్కర్ జన్మించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ చేశారు. తెలుగు, మలయాళ కుటుంబ సామెతలపై పరిశోధన చేసి అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఆయనకు తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం,కన్నడం,మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతి, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ వంటి 14 భాషల్లో పట్టుంది.