ఆలేరుపై సీఎం వరాల జల్లు..

 ఆలేరుపై సీఎం వరాల జల్లు..
  • కోమటిరెడ్డి బ్రదర్స్, బీర్ల ఐలయ్య, చామలపై సీఎం ప్రశంసలు

యాదాద్రి, యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా ఆలేరు నియోజవకర్గంలో  రూ.1051.45 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు  సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం తుర్కపల్లి మండలం తిర్మలాపూర్​లో జరిగిన బహిరంగ సభలో సీఎం వరాల జల్లులు కురిపించారు. ‘ఇది గొప్ప గొప్పోళ్లు పుట్టిన గడ్డ’ అని, ఉమ్మడి నల్గొండకు ఉద్యమ చరిత్ర ఉందని సీఎం అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకులు పట్టి పోరాటం చేసిన చోటనే భూదానోద్యమం పుట్టిందన్నారు. 

సర్దార్​ సర్వాయి పాపన్నగౌడ్​ ఏలిన ప్రాంతమని, దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం, చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకున్నదన్నారు. ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి, రావినారాయణరెడ్డి, బీఎన్​రెడ్డి, ధర్మ భిక్షం వంటి వారు కొట్లాడరని తెలిపారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్​ బాపూజీ పోరాడితే, మలిదశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. 

భువనగిరి పార్లమెంట్ గెలుపును మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భుజం వేసుకొన్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్​కు అండగా నిలిచి 11 అసెంబ్లీ, 2 పార్లమెంట్​స్థానాలు గెలిపించుకున్నారని తెలిపారు. అందుకే రూ.50 వేలు జేబులోలేని మందుల సామేల్ 50 వేల మెజార్టీతో గెలిచారని తెలిపారు. బీర్ల ఐలయ్య అడగకున్నా పిలిచి ప్రభుత్వ విప్​ ఇచ్చానని సీఎం తెలిపారు. 
ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయండి..

సీఎం రేవంత్ ను కోరిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను తీర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. ఆలేరు ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలన్నారు. గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాలకు నవాబ్ పేట రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు అందించడానికి కాల్వ సమస్యలు ఉన్నాయని, కాల్వ మరమ్మతుల కోసం నిధులిచ్చి సాగునీటి కష్టాలు తీర్చాలని కోరారు.

 కాళేశ్వరం ప్రాజెక్టు 15వ ప్యాకేజీ కింద పెండింగ్ లో ఉన్న ఎనిమిది కిలోమీటర్ల సబ్ కెనాల్ పనులకు నిధులు కేటాయించి రాజాపేట మండలంలోని 16 గ్రామాలకు సాగునీటి అందించాలన్నారు. ఒకప్పుడు విజయ డెయిరీలో భాగమైన మదర్ డెయిరీ సంస్థను గత పాలకులు అప్పులపాలు చేశారని, కష్టాల్లో ఉన్న మదర్ డెయిరీకి ప్రత్యేక ఫండ్స్ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీటింగ్​లో మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎమెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, కుంభం అనిల్​కుమర్​ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, ఎమ్మెల్సీ తీన్మార్​మల్లన్న, నాయకులు పాల్గొన్నారు. 

తిర్మలాపూర్ లో రెండు గంటలు..

ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శంకుస్థాపన చేయడం కోసం యాదాద్రి జిల్లా తిర్మలాపూర్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా రెండున్నర గంటలపాటు గడిపారు. సాయంత్రం 4:10 గంటలకు హెలికాప్టర్ లో తిర్మలాపూర్ కు చేరుకుని సాయంత్రం 6:17 గంటల వరకు ఉన్నారు.  బహిరంగ సభ వేదికపై జ్యోతిప్రజ్వలన చేసి సభకు వచ్చిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ప్రేమలత, బుజ్జి, షేక్ నమ్రీన్ సుల్తానా అనే ముగ్గురు మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పత్రాలు అందజేశారు. 

అదేవిధంగా మమత, పల్లవి, స్వప్న, రేణుక, రమాదేవి, సుజాత, స్రవంతి అనే స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రూ.54.70 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శేషవస్త్రాలను కప్పి నారసింహుడి విగ్రహం, స్వామివారి లడ్డూప్రసాదం అందజేశారు. ఆలేరు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సభాస్థలి కిక్కిరిసింది. 

జనసంద్రమైన సభా ప్రాంగణం..

తిర్మలాపూర్​లో సీఎం సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆలేరు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సభాస్థలి కిక్కిరిసింది. సభా ప్రాంగణంలో వేసిన కుర్చీలు సరిపోకపోవడంతో చాలామంది నిల్చోనే సీఎం ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. 

సీఎం శంకుస్థాపన చేసినవి ఇవే..

రూ.574.56 కోట్లతో 1.41 టీఎంసీల కెపాసిటీతో నిర్మించే గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన

తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలో రూ.200 కోట్లతో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన

రూ.2113.90 లక్షల ఎంఆర్ఆర్, సీఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన

యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లిలో 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రూ.22.75 కోట్లతో నిర్మించే గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన

ఆలేరు మండలం కొలనుపాకలో రూ.7.50 కోట్లతో చేపట్టే హైలెవల్ వంతెన, రాజాపేట మండలం కాల్వపల్లిలో రూ.6 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన

మోటకొండూర్ మండల కేంద్రంలో రూ.8.25 కోట్లతో నిర్మించే తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ భవనాలకు శంకుస్థాపన

ఆలేరులో వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.2.75 కోట్లతో 2500 మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో నూతన గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన

యాదగిరిగుట్టలో రూ.183 కోట్లతో మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

 రూ.25 కోట్లతో చేపట్టే యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన