
- అడ్డగోలుగా సంతకాలు పెడ్తే శివబాలకృష్ణ గతే
- సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్కయితది: సీఎం రేవంత్రెడ్డి
- మేం అపరమేధావులం కాదు.. అనాలోచిత నిర్ణయాలు తీసుకోం
- ఏ నిర్ణయంలోనైనా అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటం
- చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటం.. రాష్ట్రాభివృద్ధికి 2050 మెగా మాస్టర్ ప్లాన్ అమలు
- ఫార్మాసిటీ రద్దు కాలేదు.. ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తం
- త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు వస్తుంది
- ఫైర్ డిపార్ట్మెంట్లో 1,000 పోస్టులు భర్తీ చేస్తమని హామీ
- నానక్రామ్గూడలో -ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: పరిపాలనను అర్థం చేసుకోకుండా ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెడితే హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు పట్టిన గతే పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేధావులు, అనుభవజ్ఞుల సలహాలు పాటించకుండా సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ పరిస్థితి వస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించుకుంటూ, భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నిర్మించిన ఫైర్ సర్వీసెస్ హెడ్క్వార్టర్స్ను సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
ఇందులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, డీజీపీ రవిగుప్తా, ఫైర్సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి సహా పోలీస్ ఉన్నతాధికారులు, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ..హైదరాబాద్ నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. చట్టపరిధికి లోబడి మాత్రమే అధికారులు పనులు చేయాలని ఆయన సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడం అనేది తన దగ్గర కుదరదని, గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టిన శివబాలకృష్ణకు వచ్చిన పరిస్థితిని ఎవరమూ రానిచ్చుకోవద్దని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో తమ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందన్నారు.
2050 మెగా మాస్టర్ ప్లాన్
‘‘గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను పరిష్కరించుకుంటూ ఓ క్రమపద్ధతిలో ముందుకెళ్తం. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతం” అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మనం చేసే దానిపై మనకు పూర్తి అవగాహన ఉండాలని, అదే విధానాన్ని తాను నమ్ముతానని ఆయన తెలిపారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు వంద సార్లు ఆలోచిస్తానని, అనుభవజ్ఞుల సలహాలు తప్పకుండా తీసుకుంటానని అన్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచిస్తే ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. 30 ఏండ్లుగా హైదరాబాద్ను పాలకులు ఎంతో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు.
‘‘గత 30 ఏండ్లలో హైదరాబాద్ నగరం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్, కేసీఆర్ కృషి చేశారు. ఆ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటం. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఎవరి ఆలోచన విధానం ఎలా ఉన్నా.. హైదరాబాద్ను అభివృద్ధి పథంలో నడిపిస్తం. ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబునాయుడు ప్రతిపాదించారు. దాన్ని కొనసాగిస్తూ వైఎస్సార్ పూర్తి చేశారు. ఇదే తరహాలో మా ప్రభుత్వం కూడా 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు వెళ్తుంది” అని ఆయన చెప్పారు. అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పరిపాలన అర్థం చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని అన్నారు.
త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు
రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు విషయంలో ఎలాంటి అపోహలు వద్దని సీఎం రేవంత్ సూచించారు. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు వస్తుందని, రింగ్ రోడ్డు మొత్తం రైలు వసతి కల్పించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. ‘‘రీజినల్ రింగ్ రోడ్డు నుంచి ఔట్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో క్లస్టర్స్ ఏర్పాటు చేస్తం. అన్ని ఒకే ప్రాంతంలో ఉండే విధంగా చైనా తరహాలో క్లస్టర్స్ ఏర్పాటు చేస్తం. 10 నుంచి 15 శాటిలైట్ సిటీస్ ఏర్పాటు చేయాలనేది మా ప్రభుత్వ విధానం. హైదరాబాద్తో తెలంగాణ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తం.
మెట్రో కారిడార్స్ విస్తరించినం” అని ఆయన వివరించారు. ‘‘ఫార్మా సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నరు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన బల్క్ డ్రగ్ ఫార్మా వల్ల భూగర్భ జలాలు, వాయు కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకే ప్రాంతంలోని 25 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ తీసుకొస్తే నగరం అంతా కలుషితం అవుతుంది. ఫార్మాసిటీ రద్దు కాలేదు. ఎయిర్పోర్ట్కు అనుసంధానం చేసే అన్ని ప్రాంతాల్లో 2వేల నుంచి 3 వేల ఎకరాల్లో ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తం. ఆయా ఏరియాల్లో 10,15 కంపెనీలు ఏర్పాటు చేస్తే పొల్యూషన్ లేకుండా నివాసం, విద్యా, ఉద్యోగాలకు తగ్గట్టుగా ఉంటుంది. కానీ ఒకే ప్రాంతంలో 25 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ తీసుకొస్తే నగరం అంతా కలుషితం అవుతుంది. దీర్ఘకాలిక ఉపయోగాలు ఉండే విధంగా ప్రణాళికలు చేస్తున్నం” అని ఆయన తెలిపారు.
త్వరలో ఫైర్ డిపార్ట్మెంట్లో 1,000 పోస్టుల భర్తీ
తాము చట్టపరిధికి లోబడి మాత్రమే పనులు చేస్తామని, చట్టాన్ని ఉల్లంఘించబోమని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడేవాళ్లను, రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగపడే వాళ్లను, నిబంధనలు అతిక్రమించకుండా పారదర్శకంగా పనిచేసే వాళ్లను మాత్రమే ప్రభుత్వంలో నియమించామని, మిగితా వారికి కూడా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఫైర్ డిపార్ట్మెంట్లోని 3,000 పోస్టులకు గాను ప్రస్తుతం 2,000 మంది ఉన్నారని, రానున్న రోజుల్లో మరో 1,000 ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఫైర్ సర్వీసెస్ ఉద్యోగులకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్తరహాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
కన్స్ట్రక్షన్స్లో ఏమైనా చేయాలనుకుంటే
"ఆ రంగంలోని మేధావుల సలహాలు తీసుకుంటం. పరిపాలన విషయంలో అధికారుల సూచనలు అడుగుతం. ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలంటే అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల సలహాలు కోరుతం. మా అంతలా మేమే కూర్చొని, మేమే అపరమేధావులమని రుద్దితే మేడిగడ్డలా అవుతుంది. మేం అపరమేధావులం కాదు.. సొంత తెలివిని రుద్ద దలచుకోలేదు. అనుభవజ్ఞులతో మాట్లాడి.. వాళ్ల సలహాలు, సూచనలు తీసుకుంటం.. ఓపెన్ మైండ్తో ఉంటం.. మాకు ఎలాంటి భేషజాలు లేవు" అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.