తుర్కపల్లి మండలంలో 70 వేల మందితో సీఎం బహిరంగ సభ : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

తుర్కపల్లి మండలంలో 70 వేల మందితో సీఎం బహిరంగ సభ : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను 70 వేల మందితో  నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. బుధవారం యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని తెలిపారు. అందులో భాగంగానే దాదాపు రూ.1500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. 

ఆలేరు నియోజకవర్గం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలు, కార్యకర్తల కోసం 500 ఆర్టీసీ బస్సులు, 400 డీసీఎంలు, 2 వేల కార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దాదాపు 5 వేల బైకులతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ తోపాటు బహిరంగ సభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారని తెలిపారు.

 బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సక్సెస్ చేయాలని పలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ చీఫ్ సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ శ్రీశైలం, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎంపీపీ అశోక్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ 
పాల్గొన్నారు. 

సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల..

ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ బుధవారం విడుదలైంది. ఈనెల 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తుర్కపల్లి మండలంలో సీఎం పర్యటన కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు. 3:06 గంటలకు హెలిప్యాడ్ వద్ద నుంచి సభాస్థలి వద్దకు చేరుకుంటారు.

 3:07 గంటలకు అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలుకుతారు. 3.08 నుంచి 3.20 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల పైలాన్ ఆవిష్కరించి శంకుస్థాపన చేస్తారు. 3.22 గంటలకు బహిరంగ సభ వేదికపైకి చేరుకుంటారు. 3.27కు సభలో తెలంగాణ గీతం ఆలాపించనున్నారు. 3.30 గంటలకు ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 3.45 గంటలకు పలువురు మంత్రులు ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం 12 మంది లబ్ధిదారులకు చెక్కులను సీఎం అందజేయనున్నారు.

సభాస్థలిని పరిశీలించిన సీపీ 

ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి రేపు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇందులో భాగంగా తిర్మలాపూర్ లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లు, గంధమల్ల చెరువును రాచకొండ సీపీ సుధీర్ బాబు బుధవారం పరిశీలించారు. సీఎం సందర్శించే ప్రదేశాల్లో తిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసులు సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

 ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం హెలికాప్టర్ లో వస్తున్నా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రోడ్ల వెంట కూడా పొలీసుల పహారా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం పర్యటన ముగించుకుని వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగాన్ని సీపీ ఆదేశించారు. డీసీపీ అక్షాంశ్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీబీ శ్రీనివాస్, తహసీల్దార్ దేశ్యానాయక్, తదితరులున్నారు.