ఆగమైన వ్యవస్థలను సెట్​ చేస్తున్నం : సీఎం రేవంత్​రెడ్డి

ఆగమైన వ్యవస్థలను సెట్​ చేస్తున్నం : సీఎం రేవంత్​రెడ్డి
  • ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నం
  • రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్​రెడ్డి
  • బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు
  • ప్రజల ఆలోచనలను ప్రభుత్వం ఆచరిస్తున్నది 
  • తెలంగాణ వల్లే కులగణనకు కేంద్రం ఒప్పుకుంది
  • ప్రపంచంతో పోటీ పడేలా ‘తెలంగాణ రైజింగ్ -–2047’
  • పదేండ్లలో ట్రిలియన్  డాలర్ల ఎకానమీగా రాష్ట్రం
  • న్యూయార్క్‌‌, టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్‌‌ సిటీ
  • స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు
  • సన్నబియ్యం పంపిణీతో మూడు కోట్ల మందికి లబ్ధి
  • ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ స్కూల్​ విధానం తీసుకువస్తున్నం
  • కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని వెల్లడి
  • పరేడ్ గ్రౌండ్​లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో అస్తవ్యస్తంగా తయారైన రాష్ట్ర ఆర్థిక రంగంతోపాటు అన్ని వ్యవస్థలను తాము అధికారంలోకి వచ్చాక గాడినపెడ్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఆటంకాలను అధిగమిస్తూ ప్రపంచంతో పోటీ పడేలా ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామన్నారు. న్యూయార్క్, టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని చెప్పారు. ‘‘పదేండ్లలో నాశనమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా సెట్ చేస్తున్నం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. 

విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. సమాచార కమిషనర్లు, లోకాయుక్త, హెచ్​ఆర్సీ సభ్యులను నియమించి వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నం’’  అని ఆయన వివరించారు. తెలంగాణ చేసి చూపించడం వల్లే  కేంద్రం జనగణతో పాటు కులగణన చేస్తామని ఒప్పుకుందని పేర్కొన్నారు. తాము ఇస్తున్న రూ.500 బోనస్‌‌‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలో సన్న వడ్ల సాగు గణనీయంగా పెరిగిందన్నారు. మహిళ సంఘాలలో ఉన్న మహిళలకు ఉచిత వైద్య పరీక్షల కోసం క్యూఆర్​ కోడ్​ కార్డులు ఇస్తామని ఆయన తెలిపారు. సోమవారం పరేడ్​ గ్రౌండ్​లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు గన్​పార్క్​లోని  అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు. పరేడ్​ గ్రౌండ్​లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. 

ప్రజల ఆలోచనలే మా ఆచరణ 

కట్టుబానిసత్వం, వెట్టిచాకిరీని తెలంగాణ సమాజం సహించదని, ప్రజల ఆలోచనలే ప్రజా ప్రభుత్వ ఆచరణగా ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.  2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ‘తెలంగాణ రైజింగ్-2047’ భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సీఎం ప్రకటించారు. వచ్చే పదేండ్లలో 1 ట్రిలియన్ , 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.  పారదర్శక పరిపాలనతో దేశంలో, ప్రపంచంలో నంబర్ వన్‌‌‌‌గా తెలంగాణను నిలిపే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రజల అండతో ఈ లక్ష్యం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

మహిళలు మహలక్ష్మీలా నిలబడేలా చేస్తున్నం

తెలంగాణ సమాజానికి మహిళలే పునాదని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పంతో ‘ఇందిరా మహిళా శక్తి మిషన్’ పాలసీ ఆవిష్కరించామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. తొలి ఏడాదిలో రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు పంపిణీ చేశామని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించామని తెలిపారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. యూనిఫాంల కుట్టుపని, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లతో మహిళలను ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలవుతున్నదని తెలిపారు. 600 బస్సులు కొనుగోలు చేయించి, 150 బస్సులను అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నామని వివరించారు.

రైతులను రుణవిముక్తులుగా చేశాం

రైతే రాష్ట్ర వెన్నెముకని, రూ.2 లక్షల రుణమాఫీతో 25 లక్షల 35 వేల 964 మంది రైతులకు రూ.20,617 కోట్లు మాఫీ చేసి రుణ విముక్తులుగా చేశామని సీఎం రేవంత్​ తెలిపారు.  రూ.15,333 కోట్లతో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతు భరోసాతో ఎకరాకు రూ.12 వేలు, భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో రూ.12 వేలు అందిస్తున్నామని చెప్పారు. వరి ధాన్యానికి మద్దతు ధర, సన్న వడ్లకు రూ.500 బోనస్‌‌‌‌తో 275 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలో నంబర్ వన్‌‌‌‌గా నిలిచిందన్నారు. 8 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలతో ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. భూ భారతి–-2025 చట్టంతో భూ హక్కుల రికార్డులు పక్కాగా నిర్వహించి, భూ వివాదాలు లేని తెలంగాణ కోసం భరోసా కల్పిస్తున్నామని ఆయన వివరించారు.

ప్రీ స్కూల్​ విధానం తీసుకువస్తున్నాం

యువతే భవిష్యత్తని, 16 నెలల్లో 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి, నియామక పత్రాలు అందించామని ముఖ్యమంత్రి తెలిపారు.  డీఎస్సీతో 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని, అంతర్జాతీయ పెట్టుబడులతో లక్ష మందికి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించామ న్నారు.  సివిల్స్ అభ్యర్థులకు లక్ష రూపాయల సాయం చేస్తున్నట్లు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-స్కూల్ విధానం తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.  మెస్ చార్జీలను 40%, కాస్మోటిక్ చార్జీలను 200% పెంచామని, రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని వివరించారు.  ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి పూర్వ వైభవం, ఆరోగ్యశ్రీతో రూ.10 లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.  సన్న బియ్యం పథకంతో 3 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారని, ఖమ్మం సారపాకలో లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన ఆనందం గుండెల్లో నిలిచిపోతుందని  పేర్కొన్నారు. 

కుల గణన.. ఎస్సీ వర్గీకరణ చేపట్టినం

రిజర్వేషన్లు పెంచి బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని.. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే చర్యలు తీసుకున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. శాస్త్రీయ కులగణనతో 56.36% బీసీల లెక్క తేల్చామన్నారు. తెలంగాణ వల్లే కేంద్రం జనగణనలో కులగణన చేపట్టేందుకు ఒప్పుకుందన్నారు. ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించామని తెలిపారు. 

ఫ్యూచర్ సిటీ మౌలిక వసతులు

న్యూయార్క్, టోక్యోతో పోటీ పడేలా 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీ, లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీని నిర్మించేందుకు ‘ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ’ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. మూసీ నదికి పూర్వ వైభవం కల్పిస్తామన్నారు. బాపూఘాట్‌‌‌‌ను గాంధీ సరోవర్‌‌‌‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ, రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, రూ.24 వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. పోలీస్ శాఖను పటిష్టపరిచి, డ్రగ్స్‌‌‌‌పై ఉక్కుపాదం మోపామని, ఇండియా జస్టిస్ రిపోర్ట్-–2025లో తెలంగాణ పోలీస్ దేశంలో నంబర్ వన్‌‌‌‌గా నిలిచిందన్నారు. 

హైదరాబాద్ నార్కోటిక్ విభాగానికి దుబాయ్‌‌‌‌లో అంతర్జాతీయ అవార్డు లభించిందని చెప్పారు. టెర్రరిజంపై పోరులో సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించామని తెలిపారు. భారత్ సమిట్‌‌‌‌తో 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులతో హైదరాబాద్‌‌‌‌ను అంతర్జాతీయ వేదికగా మార్చామని, 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చామని సీఎం రేవంత్​రెడ్డి గుర్తుచేశారు. కాగా వేడుకలకు  జపాన్​లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.