మెగా టోర్నీల్లో టీమిండియా ఫెయిల్యూర్లో కోచ్లకూ బాధ్యత
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్లాంటి టీమ్ గేమ్స్లో జట్టు గెలుపు, ఓటముల్లో ఆటగాళ్లతో పాటు కోచ్ల పాత్ర కూడా ఉంటుంది. టీమ్ సక్సెస్ అయితే ప్లేయర్లతో పాటు కోచ్లకూ ప్రశంసలు, అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఓడినప్పుడూ అంతే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. టీమిండియా వరుసగా మెగా టోర్నీల్లో ఫెయిలవుతున్న నేపథ్యంలో కోచింగ్ స్టాఫ్ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్తో పాటు తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి తర్వాత రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్పై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో బీసీసీఐ అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. మరో నాలుగు నెలల్లో సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ విషయంలో ఆచితూచి స్పందించనుంది.
అన్నింటా నిరాశే
అండర్19, ఇండియా–ఎ జట్లను తీర్చిదిద్దిన తర్వాత రాహుల్ ద్రవిడ్ నేషనల్ టీమ్ హెడ్ కోచ్గా బాధ్యతలు అందుకోగా.. బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్గా పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాదీ టి. దిలీప్ పని చేస్తున్నారు. విక్రమ్ హయాంలో టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం రాణించడం లేదు. దాదాపు టాప్ ప్లేయర్లంతా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. టెస్టుల్లో టాప్5 ప్లేయర్లు విదేశాల్లో నిరాశ పరచడం జట్టును దెబ్బతీస్తోంది. ఇక, షమీ, బుమ్రా, ఇషాంత్ లాంటి సీనియర్ల కెరీర్కు ఊపు తెచ్చి సిరాజ్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్, నవ్దీప్ సైనీ తదితరులను తీర్చిదిద్దిన భరత్ అరుణ్ టీమిండియా పేస్ బౌలింగ్ను అద్భుతంగా మార్చాడు. కానీ, అతని స్థానంలో పరాస్ మాంబ్రే బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా బౌలింగ్లో పదును తగ్గింది. కొన్నిసార్లు మంచి పెర్ఫామెన్స్ చేసినా చాలా మంది ప్లేయర్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. స్పిన్కు అనుకూలించే వికెట్లపై తప్ప సవాల్ విసిరే పిచ్లపై, విదేశాల్లో బౌలర్లు రాణించలేకపోతున్నారు. వారి వర్క్లోడ్ మేనేజ్మెంట్ విషయంలో కూడా కోచింగ్ స్టాఫ్ లెక్కలు తప్పుతున్నాయి. ఇక, హైదరాబాద్కు చెందిన ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ హయాంలో ఇండియా టీమ్ వరల్డ్లోనే బెస్ట్ ఫీల్డింగ్ సైడ్గా మారింది. అతని స్థానంలో ఫీల్డింగ్ కోచ్గా వచ్చిన మరో హైదరాబాదీ టి. దిలీప్ కోచింగ్లో జట్టు ఫీల్డింగ్ నాసిరకంగా తయారైంది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్స్లో చేసిన తప్పిదాలే అందుకు ఉదాహరణ.
ఆ ముగ్గురికి వార్నింగ్!
వరుస ఫెయిల్యూర్స్ నేపథ్యంలో కోచింగ్ స్టాఫ్పై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ పెద్దలపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే, వరల్డ్ కప్ దృష్ట్యా ఇప్పటికిప్పుడు కోచింగ్ స్టాఫ్ మొత్తంపై వేటు వేసే అవకాశం కనిపించడం లేదు. వరుసగా మూడు ఈవెంట్లలో ఫెయిలైనప్పటికీ హెడ్ కోచ్ ద్రవిడ్పై బోర్డు నమ్మకం ఉంచింది. ప్రస్తుతానికి తను సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ద్రవిడ్ కాంట్రాక్టు వరల్డ్ కప్ జరిగే నవంబర్ వరకు ఉంది. సొంతగడ్డపై జరిగే ఆ టోర్నీలో తేడా జరిగితే మాత్రం ద్రవిడ్కు ఎక్స్టెన్షన్ కష్టమే. బోర్డు చర్యలు తీసుకునే ముందే తనే తప్పుకునే చాన్సుంది. ఇక, వరల్డ్ కప్నకు ముందు ఇండియా.. ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) ఆడనుంది. ఇందులో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో ఇండియా రాణించకుంటే విక్రమ్, మాంబ్రే, దిలీప్లపై బోర్డు చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బోర్డు పెద్దల నుంచి వీరికి వార్నింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. పనితీరు మారి, ఫలితాలు రాకుంటే ఈ ముగ్గురిపై వేటు తప్పదు.
ఇవీ తప్పులు..
గ్రౌండ్లో ప్రత్యర్థితో తలపడేది ప్లేయర్లే అయినా ఆయా టోర్నీలు, మ్యాచ్లకు వారిని ప్రిపేర్ చేసి, ప్లానింగ్ చేయడంలో కోచింగ్ స్టాఫ్ పాత్ర కీలకమైంది. అయితే కొన్నాళ్లుగా హెడ్ కోచ్ ద్రవిడ్ అండ్ కో వ్యూహాలన్నీ బెడిసికొడుతున్నాయి. ఇందులో ప్రధానమైనది కీలక మ్యాచ్ల్లో టీమ్ మేనేజ్మెంట్ వద్ద ప్లాన్–బి లేకపోవడం. పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా, కీపర్ రిషబ్ పంత్ గాయాలతో టీమ్కు దూరం అవగా వారి స్థానాలను భర్తీ చేయలేకపోయారు. టీమ్లో పోటీ పెరిగి చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. వరసగా ఫెయిలవుతున్న ప్లేయర్లపై అతిగా నమ్మకం ఉంచిన ద్రవిడ్.. టీమ్ సెలెక్షన్స్లో అనేక తప్పిదాలు చేశాడన్న విమర్శలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్కప్లో లెగ్ స్పిన్నర్ చహల్ను బెంచ్పై ఉంచడం, డబ్ల్యూటీసీ ఫైనల్లో బెస్ట్ బౌలర్ అశ్విన్ను తీసుకోకపోవడం బెడిసికొట్టింది. కీపర్ కేఎస్ భరత్ బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయినా.. పంత్ స్థానంలో సీనియర్ సాహా పేరును కనీసం పరిశీలించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.