
న్యూఢిల్లీ: కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టిట్యూషనల్, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యాయి. ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు సేకరించింది. కోల్ ఇండియా ఓఎఫ్ఎస్ జూన్ 1, 2 తేదీల్లో ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉండగా, ప్రభుత్వం మొత్తం 18.48 కోట్ల షేర్లు లేదా 3 శాతం వాటాను అమ్మింది. ఈ పబ్లిక్ ఇష్యూలో షేరు రూ.225 కి అమ్మకానికి పెట్టారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు గురువారం ఏకంగా 28.76 కోట్ల షేర్ల కోసం అప్లయ్ చేసుకోగా, రిటైల్ ఇన్వెస్టర్లు 2.58 కోట్ల షేర్ల కోసం సబ్స్క్రయిబ్ అయ్యారు.
ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు శుక్రవారం మరో 5.12 కోట్ల షేర్లకు సబ్స్క్రయిబ్ అయ్యారు. ప్రస్తుతం కోల్ ఇండియాలో ప్రభుత్వానికి 66.13 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ల ద్వారా రూ.51 వేల కోట్లు సేకరించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపడుతున్న మొదటి ఇష్యూ కోల్ ఇండియా ఓఎఫ్ఎస్. కంపెనీ షేర్లు శుక్రవారం రూ.231 దగ్గర ముగిశాయి. కోల్ ఇండియా షేర్లు పడడం ఇన్వెస్టర్లకు మంచి అవకాశమని, కంపెనీ షేర్లను కొనొచ్చని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. దేశంలో పవర్ డిమాండ్ పెరుగుతుండడం, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ విస్తరిస్తుండడం, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ అందుబాటులోకి వస్తుండడంతో కోల్ ఇండియా షేరు ఇన్వెస్ట్మెంట్కు మంచి అవకాశమని చెబుతున్నారు.