- నేడు జీడీకే 5 ప్రాజెక్ట్ ప్రారంభించనున్న డైరెక్టర్లు
గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో మరో కొత్త ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్లో కోల్ ప్రొడక్షన్ షురూ కానుంది. రామగుండం ఏరియాలోని జీడీకే 5 ప్రాజెక్ట్ను శనివారం సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్, డి.సత్యనారాయణరావు ప్రారంభించనున్నారు. దీంతో సింగరేణిలో 20వ ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్గా జీడీకే 5 మారనుంది. గత ఏడాది జులై 15న పబ్లిక్ హియరింగ్ నిర్వహించగా డిసెంబర్ 1న కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆనాటి నుంచి ఓబీ కంపెనీ మట్టిని తొలగించింది.
దాదాపు 15 ఫీట్ల లోతులోనే బొగ్గు తేలడంతో ఇక కోల్ ప్రొడక్షన్ పనులపై మేనేజ్మెంట్ దృష్టి సారించింది. రూ.471.19 కోట్లతో ఈ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తుండగా, ఇందులో మొత్తం 33.24 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. 300 మీటర్ల లోతులో బొగ్గును తీయనుండగా ఏటా 30 లక్షల టన్నుల కోల్ను 15 సంవత్సరాల పాటు ఉత్పత్తి చేయనున్నారు. మొత్తం 790 హెక్టార్ల విస్తీర్ణంతో కూడిన ఈ ప్రాజెక్ట్లో 336 హెక్టార్ల పరిధిలోనే బొగ్గు, మట్టిని వెలికితీస్తారు. మిగిలిన భూభాగంలో పర్యావరణపరంగా మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ భూమి లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్కు లైన్ క్లియర్ అయినట్టైంది. ఈ ప్రాజెక్ట్లో వెలికితీసిన బొగ్గును రామగుండం ఎన్టీపీసీకి రవాణా చేయనున్నారు. ఇందులో 350 మంది పర్మినెంట్, 550 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తారు. ఓసీ ప్రాజెక్ట్కు చుట్టుపక్కల గల ప్రభావిత, పరిసర గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.6.96 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
