
- ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి హరికిరణ్, కలెక్టర్ అభిలాష అభినవ్
కడెం, వెలుగు: కడెం ప్రాజెక్టు, పాండాపూర్ రాంపూర్ వంతెన, వరద ప్రభావిత ప్రాంతాలను ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి హరికిరణ్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఆదివారం పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామస్తులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి హరికిరణ్ మాట్లాడుతూ.. ఈ నెల 20 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేపలు పట్టేవారు, రైతులు, పశువుల కాపరులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి మండలంలో రెస్క్యూ టీములు సిద్ధంగా ఉన్నాయని, 24 గంటలు కంట్రోల్ రూమ్ 9100577132 అందుబాటులో ఉందని తెలిపారు. వరద నీరు ప్రవహించే ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దని ప్రజలకు కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా అధికారులు గోవింద్, శ్రీనివాస్, అంజి ప్రసాద్, రమణ, డా. రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.