- సైబర్ క్రైమ్ నియంత్రణపై నిర్వహించిన అవగాహన
ఖమ్మం టౌన్, వెలుగు : సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉంటూ సైబర్ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ లో అధికారులు, సిబ్బందికి సైబర్ క్రైమ్ నియంత్రణపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫోన్ వాడకంలో అప్రమత్తంగా ఉండాలని, బహుమతులు గెలిచారు, రుణం మంజూరైందంటూ వచ్చే లింక్ లను క్లిక్ చేయవద్దని, ఓటీపీలో చెప్పొద్దని సూచించారు.
ఆన్ లైన్ గేమింగ్ లో చాలా మంది డబ్బులు పెట్టి మోసపోతున్నారని, వాటికిదూరంగా ఉండాలన్నారు. షాపింగ్ చేసే సమయంలో మన ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని చెప్పారు. ఫోన్ లో సులువైన పాస్ వర్డ్ పెట్టుకోవద్దని, తరుచూ మార్చకుంటూ ఉండాలని చెప్పారు. అనంతరం ఉద్యోగులతో కలెక్టర్ సైబర్ క్రైమ్ నియంత్రణకు సంబంధించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ జి. బిక్షం రెడ్డి, డీఎస్పీ సీహెచ్ ఆర్ వీ ఫణీందర్, సీఐ కే.నరేశ్, డీఆర్వో ఏ.పద్మశ్రీ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
