
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రక్తదానంతో మరొకరి ప్రాణాలను కాపాడొచ్చని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు, ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ ఏరియాల్లో మంగళవారం బ్లడ్ గ్రూపుల టెస్టులను నిరన్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్లడ్ గ్రూపు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. అత్యవసర సమాయాల్లో బ్లడ్ గ్రూపు తెలిస్తే రక్తదాతలకు సాయం తీసుకోవడం సులువవుతుందని చెప్పారు.
ఆపద కాలంలో రక్తం దానం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రాంలో ఆర్టీవో వెంకటరమణ, డీఎస్పీ రెహమాన్, అధికారులు మనోహర్, వెంకటపుల్లయ్య, ట్రాఫిక్ ఎస్సై నరేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేశ్కు నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు
కలెక్టర్ జితేశ్వీ పాటిల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం కలెక్టర్కు వివరాలను పంపించారు. బాంబేలో ఈ నెల 17వ తేదీన జరుగనున్న ఓపెన్ సోర్స్ జీఐఎస్ డే ప్రోగ్రాంలో ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ కలెక్టర్కు అవార్డు అందజేయనున్నారు. జిల్లాలోని పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజీలో మే 6,7 తేదీల్లో నిర్వహించిన ఓపెన్ సోర్స్ జీఐఎస్ కో హార్ట్ ప్రోగ్రాంలో గ్రామీణ సమస్యల పరిష్కారానికి జియో స్పేషియల్ డేటా వినియోగంపై ప్రాక్టీకల్గా కలెక్టర్ నేర్పించారు.
గోదావరి వరదల టైంలో నీటి స్థాయిని బట్టి ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయడం లాంటి వాటిలో జీఐఎస్ ఎంతో ఉపయగపడనుందని కలెక్టర్ పేర్కొన్నారు. అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జియో స్పేషియల్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చేసిన కృషి వల్లనే తనకు అవార్డు వచ్చిందన్నారు.