
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించేలా టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. కలెక్టరేట్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని స్కూళ్లలో ఇంగ్లిష్ బోధనపై తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై కలెక్టర్ మంగళవారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులతో ప్రతిరోజు ఇంగ్లిష్లో ఒక పేజీ రాయించడం, రెండు పేజీలు చదివించడం చేయాలని సూచించారు.
అన్ని స్కూళ్లలో లాంగ్వేజ్ క్లబ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు సీజనల్ వ్యాధులపై వైద్య శాఖ అధికారులతో రివ్యూ చేశారు. పీహెచ్సీల్లో ప్రసవాలు పెంచాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీఈవో చైతన్య జైనీ, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, డీఎంహెచ్వో వెంకటరమణ, ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సాజిత, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, వెలుగు : కొత్తపల్లి మండలం శాంతినగర్ ప్రైమరీ స్కూల్ను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. క్లాస్ రూమ్లు తిరుగుతూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మిడ్ డే మీల్స్, టీచింగ్ మెటీరియల్, రీడింగ్ కార్నర్ను పరిశీలించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆమె వెంట ఎంఈవో ఆనందం, హెచ్ఎం గౌస్ ఖాన్ ఉన్నారు.