
కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, రిపేర్లు, స్కూళ్లు, అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాల కల్పన.. తదితర పనుల్లో వేగం పెంచి వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వివిధ అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జడ్పీ, ఉపాధి హామీ, పంచాయతీ రాజ్ తదితర శాఖల ద్వారా వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, రిపేర్ల పనులను ఆగస్టులోగా పూర్తి చేయాలన్నారు.
ఇంకా గ్రౌండింగ్ పూర్తికాని పనులకు సంబంధించి రెవెన్యూ, ఇంజినీరింగ్, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంగా చేసుకోవాలన్నారు. స్కూళ్లల్లో టాయిలెట్స్, కాంపౌండ్, కిచెన్ షెడ్ నిర్మాణం, పీఎంశ్రీలో ఎంపికైన స్కూళ్లల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.