
కరీంనగర్ టౌన్,వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు సేవా దృక్పథంతో వైద్యసేవలు అందించాలని, నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రైవేట్ హాస్పిటళ్ల నిర్వాహకులకు క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, పీఎన్డీటీ చట్టంపై కలెక్టర్ పమేలాసత్పతి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
ప్రైవేటు అంబులెన్సులను వారి ఆసుపత్రుల్లోనే నిలుపుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిలిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రయత్నించాలని సూచించారు. సాధారణ డెలివరీల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ముందు వరుసలో ఉన్నాయని తెలిపారు.
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు మొబైల్ ఫోన్లు
జిల్లాలోని 33 మంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు కలెక్టర్ మొబైల్ ఫోన్లు ఇచ్చారు. పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు పెన్షన్లను సకాలంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే,డీఎంహెచ్ఒ డా. వెంకటరమణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేష్ పాల్గొన్నారు.