
కరీంనగర్ టౌన్,వెలుగు: హిందూ, ముస్లింల ఐక్యతను కాపాడడంలో తెలంగాణ ఎప్పుడు ముందుంటుందని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం సిటీలోని తెలంగాణ చౌక్ వద్ద మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని సీపీ గౌస్ ఆలంతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త యావత్ మానవాళికి ఆదర్శనీయమన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని, ప్రజల నుంచి 300 దరఖాస్తులను స్వీకరించారు.
అనంతరం వాటిని ఆయా శాఖలకు పంపి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీదా బాబా, ముస్లిం నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు శిక్షణ
కొత్తపల్లి, వెలుగు: ప్రైవేట్ విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు విభిన్న రంగాల్లో శిక్షణ ఇప్పించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఒప్పందంలో భాగంగా కొత్తపల్లి హైస్కూల్ విద్యార్థులకు ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావుతో కలిసి జేఈఈ, ఐఐటీ, నీట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లతో ఒప్పందం చేసుకొని ద్వారా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు సేవలందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు.
అనంతరం విద్యార్థులకు రాగి జావా పంపిణీని ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు నిర్వహిస్తున్న విటమిన్ గార్డెన్ ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో ఆనందం, క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్రెడ్డి, హెచ్ఎం రమేశ్, తదితరులు పాల్గొన్నారు.