ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్​, వెలుగు: జిల్లాలో వరద వచ్చే అవకాశం ఉన్న  ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం హవేలీ ఘనపూర్​ మండలం ధూప్​సింగ్​ తండా కాజ్​వే నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వాగులో వరద ఉధృతి ఉన్నప్పుడు ఎవరినీ ఆ రూట్లో వెళ్లేందుకు అనుమతించవద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 రూ.3 కోట్లతో చేపట్టిన కాజ్​వే  నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి  తండా  వాసులకు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. హవేలీ ఘనపూర్​ ఎంపీడీవో ఆఫీస్ లో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ విధానాన్ని జడ్పీ సీఈవో ఎల్లయ్యతో కలిసి  పరిశీలించారు.  పంచాయతీ కార్యదర్శులు, బీఎల్​వోలు రూపొందించిన ఓటర్ల జాబితాను టీ-పోల్ యాప్​లో నమోదు చేసేందుకు ప్రతి పంచాయతీకి ప్రత్యేకంగా ఒక లాగిన్ ఐడీ, పాస్​వర్డ్​ అందించారని చెప్పారు.  

కొత్తగా ఏర్పడిన ఒక్కో పంచాయతీలో ఆరు వార్డులకు తగ్గకుండా ఓటర్లను  విభజించాలని అందులోనూ ఒక కుటుంబం ఒక వార్డులోనే ఉండేలా నమోదు  చేయాలని సూచించారు. హవేలీ ఘనపూర్​ మండల కేంద్రంలో తెలంగాణ ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్, ఆన్​లైన్​ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సీజన్​కు జిల్లాలో తగినన్ని ఎరువులు, విత్తనాలు ఉన్నాయని కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.