
మెదక్ టౌన్, వెలుగు: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా సామర్థ్యాలను వెలికి తీసి వారిని ఉన్నతులుగా తీర్చదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం మెదక్ మండలం మంబోజి పల్లిలో మండల పరిషత్ ప్రాథమిక స్కూల్ను పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత టీచర్లపైన ఉందన్నారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించి పలు ప్రశ్నలను అడిగి వారి సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు.
పాపన్నపేట: స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. మహిళలు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 2 వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. పలు రికార్డులను పరిశీలించారు. వైద్యుడు అన్వర్, ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉన్నారు.