సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలన : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలన : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం టౌన్, వెలుగు :  కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు అర్హత పరిశీలించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) మోడ్ లో 100 సైనిక్ స్కూళ్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఖమ్మం నగరం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాల సైనిక్ స్కూల్ కింద దరఖాస్తు చేసుకోగా, నేడు క్షేత్ర స్థాయిలో పాఠశాలను పరిశీలించినట్లు తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హత పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ఎస్ఎస్ శాస్త్రి, జిల్లా విద్యా శాఖ అధికారి చైతన్య జైని, విద్యా శాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ సీహెచ్. రామకృష్ణ పాల్గొన్నారు.