కలెక్టర్ ఆర్వీ కర్ణన్
నల్గొండ అర్బన్, వెలుగు : మెడికల్ కాలేజీ పనులను 2024 మార్చిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. నల్గొండ పట్టణంలోని ఎస్ఎల్బీసీ వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని శుక్రవారం పరిశీలించారు. పనులపై ఆరా తీయగా.. 6 బ్లాకులుగా చేపట్టిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో.. నాలుగు బ్లాక్లు జీ+3, రెండు బ్లాక్లు జీ+2గా నిర్మిస్తున్నట్లు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ డీఈ లోక్ లాల్ కలెక్టర్ కు వివరించారు. ప్రిన్సిపాల్ క్వార్టర్, గెస్ట్ హౌజ్ భవనం జీ+3 గా నిర్మిస్తున్నట్లు తెలిపారు. 450 మంది వర్కర్లు పనిచేస్తున్నారని, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో కారిడార్, రూమ్స్ ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే పురుషుల హాస్టల్ జీ+4, మహిళల హాస్టల్ జీ+5గా నిర్మిస్తున్నట్లు వివరించారు. కలెక్టర్ వెంట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.రాజ కుమారి, డీఎంహెచ్వో డా.కొండల్ రావు, డీసీహెచ్ఎస్ డా.మాతృ ఉన్నారు.
మన్యంచెల్క అర్బన్ ఆస్పత్రి తనిఖీ
నల్గొండ పట్టణంలోని మాన్యం చెల్క అర్బన్ హెల్త్ సెంటర్ ను శుక్రవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డెండీ కేసులు ఎన్ని నమోదయ్యాయని డాక్టర్లను అడగగా.. రెండు కేసులు వచ్చినట్లు వారు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెంగీ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమ లార్వా పెరగకుండా గుంతలు, కుండీల్లో నీరు నిల్వ ఉండ కుండా చూసుకోవాలన్నారు. తర్వాత జ్వరంతో ఆస్పత్రికి వచ్చినగుర్రం పోడ్ మండలం పిట్టల గూడెంకు చెందిన ఎల్లమ్మకు డాక్టర్లు రాపిడ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించగా.. శాంపిల్ను తెలంగాణ డయాగ్న స్టిక్ హబ్ కు పంపాలని సూచించారు.