రైస్​ మిల్లర్లు తీరు మార్చుకోకుంటే చర్యలే

రైస్​ మిల్లర్లు తీరు మార్చుకోకుంటే చర్యలే

భైంసా, వెలుగు: మిల్లింగ్, బియ్యం నిల్వలు అందించే విషయంలో రైస్​మిల్లర్లు తమ తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్​వరుణ్​ రెడ్డి హెచ్చరించారు. బుధవారం భైంసాలోని రైస్​ మిల్లుల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కత్​గాం రోడ్డు మార్గంలోని రైస్​మిల్లులో వడ్ల నిల్వలు, మిల్లింగ్​ప్రక్రియను సక్రమంగా చేపట్టకపోవడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. రైస్​ మిల్లర్లందరూ త్వరగా మిల్లింగ్​ ప్రక్రియను చేపట్టి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించాలని ఆదేశించారు.

ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. అంతకు ముందు భైంసా పట్టణంలోని ఓవైసీనగర్​కాలనీలో పర్యటించి జీవో నం.59కు సంబంధించిన ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులు సకాలంలో ప్రభుత్వానికి రుసుము చెల్లించాలని సూచించారు. ఆ తర్వాత అగ్రికల్చర్​ ఆఫీస్ సమీపంలోని ఎస్సీ కార్పొరేషన్​షాపింగ్​ కాంప్లెక్స్​నిర్మాణ పనులను పరిశీలించి కమిషనర్​ వెంకటేశ్వర్​రావు, డిప్యూటీ ఈఈ నాగేశ్వర్​ రావులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రవి కుమార్, తహసీల్దార్​ చంద్రశేఖర్​ రెడ్డి తదితరులున్నారు.