కేరళలోని మువత్తుపుజాలో ఓ కాలేజీ విద్యార్థిని రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టిన ఘటన విషాదంగా ముగిసింది. ఈ ప్రమాదంలో విద్యార్థని నమిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 2023 జూలై 26 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మువాట్టుపుజా నిర్మలా కాలేజీ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది.
బీకామ్ చివరి సంవత్సరం చదువుతున్న నమిత అనే విద్యార్థిని పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన ఓ బైక్.. ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది. ఈ ఘటనలో నమిత అనే విద్యార్థిని చనిపోగా, మరో విద్యార్థిని అను శ్రీరాజ్ గాయపడింది. అయితే నమిత ఎర్నాకులం జిల్లాలోని కున్నక్కల్, వాలాకోమ్కు చెందిన రఘు ఆర్ కుమార్తెగా గుర్తించగా.. అనుశ్రీరాజ్ మణిమాలకి చెందిన ఎండీ జయరాజన్ కుమార్తె అని తెలుస్తోంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విజువల్స్ లో ఇద్దరు విద్యార్థులు రోడ్డు దాటుతుండగా.. వారిని అప్పుడే వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ విద్యార్థినిని బైక్ ఈడ్చుకుపోయి కొన్ని మీటర్ల దూరంలో పడేసింది. మరొక విద్యార్థిని దగ్గర్లోనే పడిపోయింది. అనంతరం వారిద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో నమిత చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటనకు కారణమైన బైకర్ అన్సన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై గతంలోనూ కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు ముందు అన్సన్ కళాశాల సమీపంలో బైక్ పై అతి వేగంతో తిరుగుతున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.