ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్,వెలుగు:సైన్స్​ అండ్ టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిర్మల్​లో మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్​ఫెయిర్ ​పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థుల మేధోసంపత్తిని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోందన్నారు. టీహబ్ ఏర్పాటు చేసి అనేక స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు దూసుకెళ్లాలని, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలని కోరారు. నిర్మల్​లో రాష్ట్రస్థాయి సైన్స్​ఫెయిర్​పోటీలు సక్సెస్​ కావడం అభినందనీయమన్నారు. డీఈవో రవీందర్ రెడ్డి, నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కొండాపూర్ సర్పంచ్ గంగాధర్, డాక్టర్  దేవేందర్ రెడ్డి, ఎస్​టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గౌడ్, ఎస్సీ ఈఆర్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

స్మార్ట్ బైక్ తయారు చేసిన స్టూడెంట్స్​కు ఎస్పీ అభినందనలు...

స్మార్ట్​ బైక్​ తయారు చేసిన విద్యార్థులు గంట హర్షిక, డి.మహేశ్​ను  ఎస్పీ ప్రవీణ్ ​కుమార్ అభినందించారు. అంతకు ముందు ఆయన చైక్​ను చూసి ఫిదా అయ్యారు. ఈబైక్ భవిష్యత్​లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. స్మార్ట్​ బైక్​పనితీరును అక్కడున్న వారికి ఎస్పీ వివరించారు. హెల్మెట్ పెట్టుకోకపోయిన, లిక్కర్ ​తాగినా వెహికల్ ​స్టార్ట్ ​కాదన్నారు. వెహికల్​నడుపుతూ ఫోన్ ​కాల్ ​లిఫ్ట్ ​చేసినా ఆటోమేటిక్​గా ఆగిపోతుందన్నారు.  కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై దేవేందర్​తదితరులు ఉన్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక..

ఇన్ ​స్పైర్​అవార్డు మనాక్​ ప్రదర్శన కోసం జాతీయస్థాయిలో పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి 26  మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో చింతల నవీన్, పండుగ సహస్ర, శ్రీ సంరత, ఎం సాన్విత, బి శైలజ, ఈర్ల సిద్దు, ఎం. విగ్నేశ్ కుమార్, ఝాన్సీబాయి, హర్షితా రెడ్డి, ఎ.రమ్యకృష్ణ, ఎర్ర స్వాతి, తేజస్విని, జె. మణి ప్రసాద్, కుష్ ఇంద్ర, వర్మ, హర్షిత, శ్రీనిధి, ఉమాదేవి, ధర్మేశ్, నాగరాజు, మహ్మద్ హఫీజ్, సిరిపురం హసిత, మొహమ్మద్, సూర్య, గణేశ్, నందిని, కె.పూజ ఉన్నారు.

వేలిముద్రలు వేసి గొర్రెల యూనిట్ స్వాహా

    ఆలస్యంగా వెలుగులోకి... ఎంక్వయిరీ చేస్తున్న ఆఫీసర్లు  

జైపూర్(భీమారం),వెలుగు: గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్​ను లబ్దిదారుడికి తెలియకుండానే కొంతమంది స్వాహా చేసిన వైనం భీమారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన మెండె సతీశ్​  రెండో విడత గొర్రెల యూనిట్​ కోసం రెండు నెలల కింద వెటర్నరీ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకున్నాడు. రెండ్రోజుల కిందట వెళ్లి అడిగితే.. అతడికి 2017–18లో మొదటి విడతలోనే గొర్రెల యూనిట్​ శాంక్షన్​ అయినట్టు రికార్డుల్లో ఉందని  అధికారులు చెప్పడంతో అవాక్కయ్యాడు. సతీష్​ ఆధార్ నంబర్​తో వేలిముద్రలు వేసి గొర్రెల యూనిట్​ను తీసుకున్నట్లు రికార్డుల్లో ఉందని వెటర్నరీ డాక్టర్​ చెప్పాడని తెలిపాడు. 

ఫస్ట్​ ఫేజ్​లో తాను అప్లై చేసుకోలేదని, డీడీ కూడా కట్టలేదని, తనకు తెలియకుండానే ఎవరో గొర్రెల యూనిట్​ను స్వాహా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చదువుకున్నానని, వేలిముద్రలు వేసే అవసరం లేదని తెలిపాడు. మండల వెటర్నరీ ఆఫీసర్ రాకేశ్​శర్మను వివరణ కోరగా 2017లో జరిగిన విషయం తమకు తెలియదని, సతీష్​ ఇచ్చిన ఫిర్యాదుపై ఎంక్వయిరీ చేస్తున్నామని తెలిపారు. గొర్రెల పంపిణీలో ఆఫీసర్లు విచారణ జరిపితే మండల వ్యాప్తంగా మరిన్ని అక్రమాలు బయటికి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.

అడవి బిడ్డలకు అందని చదువు

ఏజెన్సీలోని ఆదివాసీ బిడ్డలకు చదువు అందడంలేదు. బేల మండలం సాంగ్వి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా ఒకరు ఇటీవల బదిలీ అయ్యారు. ఉన్న ఒక్క టీచర్​ ఒకే గదిలో ఐదు తరగతులకు బోధిస్తున్నాడు. అదే గ్రామంలోని మరో ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్లో సైతం ఒక్క టీచరే చదువు చెబుతున్నాడు. వారు వచ్చిన రోజే క్లాసులు జరుగుతున్నాయి. లేదంటే అంతే. ఉన్నతాధికారులు స్పందించి గిరి బిడ్డలకు న్యాయం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరతున్నారు.  - వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్