ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఖానాపూర్,వెలుగు: కేసీఆర్​ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు చేయూత నిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ తెలిపారు. మంగళవారం ఆమె మండలంలోని సూర్జపూర్ చర్చిలో క్రిస్మస్​కానుకలు అందజేశారు. అనంతరం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్​అంకం రాజేందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పరిమి సురేశ్, మాజీ ఏఎంసీ చైర్మన్​పుష్పల శంకర్, లీడర్లు జన్నారపు శంకర్, పత్రి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

క్రిస్మస్ కానుకల పంపిణీ

గుడిహత్నూర్, వెలుగు: గుడిహత్నూర్​ చర్చిలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, తహసీల్దార్ సంధ్యారాణి, సర్పంచ్ జాదవ్ సునీత  క్రిస్మస్​కానుకలు పంపిణీ చేశారు. చర్చి పాస్టర్లు ఆఫీసర్లు, సర్పంచ్ ను శాలువాతో సన్మానించారు. బోథ్ తహసీల్దార్ అతిఖొద్దీన్, గుడిహత్నూర్ ఆర్ఐ చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ సత్యరాజ్, బీఆర్ఎస్ లీడర్లు జాదవ్ రమేశ్, వినోద్, పాస్టర్లు సదానంద్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదు

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ప్రజా సమస్యలపై బీజేపీ నాయకులు పోరాటం చేస్తుంటే వాటిని పరిష్కరించకుండా ఎమ్మెల్యే జోగు రామన్న తమపై వ్యక్తిగత ఆరోపేణలు చేస్తున్నారని జడ్పీ మాజీ చైర్​పర్సన్,  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినీరెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 14 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న జోగురామన్న కంటే తమకు ప్రజా సమస్యలపై ఎక్కువ అవగాహన ఉందన్నారు. వాటి పరిష్కారం కోసం పోరాడుతుంటే తమవి చిల్లర రాజకీయాలు అనడం సరికాదన్నారు.

రెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో ఆదివాసీలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడిస్తే గాని చలనం రాలేదన్నారు. హిందువుని అని గొప్పగా చెప్పుకునే రామన్న వినాయకుడి విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేశారో చూపాలని సవాల్​ విసిరారు. భగత్ సింగ్ చౌక్ లో ఇప్పటికీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. సమావేశంలో లీడర్లు మోహన్ అగర్వాల్, సంతోష్ కొట్టపెళ్లి, విజయ్ గన్నోజీ, సతీశ్​రెడ్డి, కిరణ్ చాహకటి, ముఖీం, ప్రశాంత్, శివకిరణ్, దుర్గాచారి తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ హస్తకళలకు ఆదరణ

గుడిహత్నూర్,వెలుగు: ఆదివాసీ హస్తకళకు ఆదరణ దక్కేందుకు మేళాలు ఉపయోగపడుతాయని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ చెప్పారు. గిరిజన కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ సహకారం, ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం ఉట్నూర్ కే బి కాంప్లెక్స్‌ పీఎంఆర్‌సీ హాలులో ఏర్పాటు చేసిన గిరిజన హస్తకళ ప్రదర్శనను ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా శ్యామ్​నాయక్, ఐటీడీఏ పీవో వరుణ్‌ రెడ్డితో కలిసి ఆమె ​ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారులు తయారుచేసిన వస్తువులను ఆమె చూశారు. గోండ్ ​పెయింటింగ్స్, డ్రైమిక్స్,​ఉసిరి ఉత్పత్తులు, చిక్కి యూనిట్, ట్రైబల్‌ ఆర్ట్స్, క్రాఫ్ట్, కోయ కల్చర్‌ ఆర్ట్స్, ఉడ్‌క్రాప్స్, బంజారా సంప్రదాయ దుస్తులకు మార్కెటింగ్​సౌకర్యం కల్పిస్తామన్నారు. ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజన హస్తకళాకారులు, మహిళా సమాఖ్య సంఘ సభ్యులు మార్కెట్​డిమాండ్ పై అవగాహన పెంచుకోవాలన్నారు.

ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా శ్యామ్‌ నాయక్‌  మాట్లాడుతూ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు, హస్తకళను బయటి ప్రపంచానికి తెలిసేలా మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అంతకుముందు గిరిజన కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రీజినల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ హస్తకళల మార్కెటింగ్, ఎగ్జిబిషన్, కళాకారుల నమోదు, ట్రైనింగ్‌వంటి వాటిపై వివరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ట్రైనీ కలెక్టర్‌ శ్రీజ, హ్యాండ్లూమ్స్, హస్తకళల శాఖ ఆఫీసర్‌ దివ్యారావు,ఆదిమ గిరిజన సలహా సంక్షేమ సంఘం అధ్యక్షుడు కనక లక్కే రావు, ఎంపీపీ జయవంత్‌ రావు, నిర్మల్‌ జిల్లా రూరల్‌ డెవలప్‌ మెంట్‌ఆఫీసర్‌ విజయలక్ష్మి, జేడీఎం నాగభూషణం, హెచ్‌వో సుధీర్ పాల్గొన్నారు.

ప్రభుత్వంపై విద్యార్థులు నమ్మకం కోల్పోతున్నారు

నిర్మల్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు నమ్మకం కోల్పోతున్నారని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామనాథ్ తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. మంగళవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కొన్ని నెలలుగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ఆఫీసర్లు మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై వీసీ సరిగా స్పందించడంలేదన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థి భానుచందర్ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, సూసైడ్ నోట్ ఆయన రాసింది కాదంటూ తల్లి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్​ చేశారు. జరిగిన ఘటనపై గవర్నర్ ఫిర్యాదు చేస్తామన్నారు.

సింగరేణికి టీఆర్​ఎస్​ చేసింది ఏమీలేదు

మందమర్రి,వెలుగు: ఎనిమిదేళ్ల టీఆర్ఎస్​ పాలనలో సింగరేణిలో ఒక కొత్త అండర్​ గ్రౌండ్ కోల్ మైన్ ఏర్పాటు జరుగలేదని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్​ ప్రెసిడెంట్ బి.సంజయ్ ​కుమార్​ విమర్శించారు. మంగళవారం మందమర్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఐదు లక్షల మందితో బుధవారం నిర్వహించనున్న బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో  తరలిరావాలని పిలుపునిచ్చారు.

సింగరేణిలో వరుసగా అండర్​ గ్రౌండ్​ కోల్ మైన్లను మూసివేయడంతో పర్మినెంట్​ఎంప్లాయీస్ సంఖ్య పడిపోతుందని, మరోవైపు విచ్చలవిడిగా ఓపెన్​కాస్ట్​ గనులను సర్కార్​ ప్రోత్సాహిస్తుందని ఆరోపించారు. బంగారు తెలంగాణ కాలేదని, కేసీఆర్​ కుటుంబం మాత్రమే వేల కోట్లను కూడబెట్టుకుందని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర మహిళ సెక్రటరీ ఎండీ షరీఫా, లీడర్లు వాసాల సంపత్, రామస్వామి, యువత పార్లమెంట్​ ప్రెసిడెంట్ సాగర్​, అనంతలక్ష్మి, రాజు, రంగనాథ్​, గాండ్ల గోపాల్, ఐద లక్ష్మి పాల్గొన్నారు.