ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ పేదల మనిషి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ చెప్పారు. గురువారం ఆదిలాబాద్​లోని శాంతినగర్ కాలనీ రేషన్ దుకాణం ఎదుట మోడీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డులో ఉన్న ప్రతీ ఒక్కరికి నెలకు ఐదు కిలోల  బియ్యం ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారన్నారు. కార్యక్రమంలో లీడర్లు లాలా మున్న, జోగు రవి, దినేశ్​మాటోలియ, మయూర్ చంద్ర, రాజేశ్, ముకుంద్, భీమ్​సేన్​రెడ్డి, ధోని జ్యోతి, శ్రీనివాస్, గణేశ్, అజయ్, ఆసిఫ్, స్వామి రెడ్డి తదితరులు ఉన్నారు.

సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికుల ఆకలి కేకల దీక్ష

మందమర్రి,వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి సివిక్ విభాగంలో డ్యూటీలు వేయాలని డిమాండ్​చేస్తూ గురువారం సింగరేణి జీఎం ఆఫీస్​ఎదుట కాంట్రాక్ట్​ కార్మికులు ఆకలి కేకల నిరసన దీక్ష చేపట్టారు. 'మేము సచ్చుడో.. ఉద్యోగాలు వచ్చుడో' అంటూ చేపట్టిన దీక్షకు టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్​, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సంజయ్​కుమార్ మాట్లాడుతూ సివిక్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్​చనిపోవడంతో ఆరు నెలలుగా 23 మంది కాంట్రాక్ట్​ కార్మికులను డ్యూటీలోకి తీసుకోవడంలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్​కు కార్మికులు బాధ చెప్పుకునే పరిస్థితిలేదన్నారు. అంతకు ముందు దీక్షలో కూర్చున్న సంజయ్​కుమార్​కు హెచ్ఎంఎస్​ ప్రెసిడెంట్ రియాజ్​అహ్మద్​పూలమాల వేశారు. దీక్షలో కార్మికులు చంటిపిల్లలతో కూర్చున్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల లీడర్లు రియాజ్ అహ్మద్, చిప్ప నర్సయ్య, సలెంద్ర సత్యనారాయణ, పార్వతి రాజిరెడ్డి, ఎండీ జాఫర్, టీడీపీ లీడర్లు జక్కుల సమ్మయ్య, ఎండీ షరీఫా, వాసాల సంపత్, బొల్లం మధు, కరిడే తిరుపతి, అనంతలక్ష్మి పాల్గొన్నారు.

తెచ్చుకున్న  తెలంగాణ ఆగమైంది

మందమర్రి/చెన్నూరు,వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆగమైందని, కల్వకుంట్ల కుటుంబంలో చేతిలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే, చెన్నూరు నియోజకవర్గ బీజేపీ పాలక్  బొడిగ శోభ ఆరోపించారు. గురువారం మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్రాల ఇన్​చార్జీలు, బూత్​కన్వీనర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​దోచుకొని దాచుకున్నాడని, బిడ్డేమో లిక్కర్ లో పెట్టుబడి పెట్టిందని, కొడుకేమో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు పెట్టుకొని వేలకోట్లు సంపాదించాడని పేర్కొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే సుమన్​ ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. 2023లో తెలంగాణలో బీజేపీకి 100 సీట్లు రావడం ఖాయమన్నారు. ఈనెల 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో నిర్వహించే తెలంగాణ స్థాయి  బూత్​, శక్తికేంద్రాల మీటింగ్​విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా బీజేపీ లీడర్​ వైద్య శ్రీనివాస్​ దంపతులు, ఇతర లీడర్లు మాజీ ఎమ్మెల్యే శోభను సన్మానించారు. సమావేశాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, లీడర్లు శివరాజ్​కుమార్, సప్పిడి​నరేశ్, మహంకాళి శ్రీనివాస్, పైడిమల్ల నర్సింగ్, అక్కల రమేశ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్, పాలరాజయ్య తదితరులు పాల్గొన్నారు.

కాగజ్​నగర్​కు ఫాస్టెస్​ గ్రోయింగ్​ అవార్డు

కాగ జ్ నగర్,వెలుగు: కాగజ్​నగర్​మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్​2022లో రెండో ఫాస్టెస్​ గ్రోయింగ్ సిటీ అవార్డు దక్కింది. గురువారం హైదరాబాద్​లో ఐటీ మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అడిషనల్ కలెక్టర్​చాహత్​బాజ్​పేయి, మున్సిపల్​కమిషనర్​కు అందజేశారు. సౌత్​ ఇండియాలో 50 వేల జనాభా నుంచి లక్ష జనాభా పెరుగుదల కేటగిరీలో కాగజ్​నగర్​నిలిచిందని ఆఫీసర్లు తెలిపారు.

నిర్మల్​, భైంసాకు ఓడీఎఫ్​ డబుల్​ ప్లస్​..

నిర్మల్,వెలుగు: నిర్మల్, భైంసా మున్సిపాలిటీలు ఓడీఎఫ్ డబుల్ ప్లస్ అవార్డులు దక్కించుకున్నాయి. హైదరాబాద్​లో గురువారం మంత్రి కేటీఆర్ అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ కు ప్రశంసాపత్రం అందజేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు సక్సెస్ ఫుల్ గా చేపట్టినందుకు ఈ అవార్డులు దక్కాయి.

మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలి

బెల్లంపల్లి రూరల్,వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్​ సభ్యుడు ఆనంద్  సూచించారు. నెన్నెల కేజీబీవీ స్టూడెంట్స్ కు పురుగుల భోజనం పెడుతున్నారని ‘వెలుగు’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్స్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 60 కిలోల బియ్యం వండి 100 కిలోల బియ్యం వండి పెట్టినట్లు రికార్డు చేయడంపై ఆయన మండిపడ్డారు. కస్తూరిబాలో మెనూ బోర్డు, ఫిర్యాదు బాక్స్​ఎందుకు పెట్టలేదని ఎస్​వో అమూల్యను వివరణ కోరగా ఆమె పొంతన లేని సమాధానం ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో ఎంక్వైరీ చేసి నివేదికను అందజేయాలని డీఈవో వెంకటేశ్వర్లు, డీఆర్ డీవో పీడీ శేషాద్రిని ఆదేశించారు. ఎలాంటి సమస్యలున్నా.. తనకు ఫోన్​చేయాలని ఆనంద్​విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంఈవో మహేశ్వర్​రెడ్డి తదితరులు ఉన్నారు.