- గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ అధికారుల చర్యలు
- అధికంగా నీటిని వాడే కస్టమర్లకు మీటర్లు ఏర్పాటు
- ఏరియాను బట్టి రూ. 1 నుంచి రూ. 4 వరకు చార్జ్
- ప్రతి నెల గ్రౌండ్ వాటర్ వాడకం ఆధారంగా బిల్లులు
- ప్రస్తుతం ఇండస్ట్రీస్కి మీటర్లు పెడుతున్న అధికారులు
- భవిష్యత్ లో కమర్షియల్గా వాడే అన్నింటికీ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు : సిటీలో వాణిజ్య అవసరాల కోసం బోర్లు వేసుకొని భూగర్భ జలాలను వాడుకుంటున్న వినియోగదారులు మీటర్లు ఏర్పాటు చేసుకుని ఇక ముందు బిల్లులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ అధికారులు బిల్లులను కూడా కలెక్ట్ చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రభుత్వం గత జూన్లో జీవో నంబర్ 15 ను జారీ చేసింది. ఇందులో పరిశ్రమలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ యూనిట్లు, బల్క్ సప్లయర్స్, భారీ హౌసింగ్ సొసైటీలు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఒక్క రంగారెడ్డిలో మాత్రమే కొన్ని ఇండస్ట్రీయల్స్కు మీటర్లు అమర్చారు. మిగతా వాటికి కూడా పెట్టాలని సూచిస్తుండగా.. ఎన్నికలయ్యేంత వరకు మీటర్లు అమర్చేలా కనిపించడం లేదు. వినియోగదారులు 25 క్యూబిక్ మీటర్ల (1000 లీటర్లు) వరకు భూగర్భ జలాలను ఫ్రీగా వాడుకోవచ్చు. అంతకు మించి వాడితే వెయ్యి లీటర్లకు ఏరియాని బట్టి రూ. 1 నుంచి రూ. 4 వరకు చెల్లించాల్సి ఉంది. మీటర్లు పెట్టడం, బిల్లులు కలెక్ట్ చేయడం పారదర్శకంగా జరిగితే గ్రౌండ్ వాటర్ వృథా కాకుండా ఉంటుంది. కానీ అధికారులు దీన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి 3 నెలలు కావస్తున్నా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఇంకా మీటర్లు ఏర్పాటు చేయడం లేదు. దీనిపై అధికారులను అడిగితే స్పందించడం లేదు.
గ్రౌండ్ వాటర్ పెరిగే చాన్స్..
భూగర్భ జలాలు ఎక్కువగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న దగ్గరే వృథా అవుతున్నాయి. దీనిపై గ్రౌండ్ వాటర్ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటే ఫ్యూచర్లో నీటి కొరత రాకుండా ఉంటుంది. కేవలం ఆఫీసుల్లో కూర్చొని ఆదేశాలు మాత్రమే జారీ చేస్తున్నారు. జలమండలి తరహాలో చర్యలు తీసుకుంటే ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు అవకాశం ఉంది. మీటర్లు బిగించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు రెగ్యులర్గా బిల్లులు కలెక్ట్ చేస్తే గ్రౌండ్ వాటర్ వృథా కొంత మేరకైనా అరికట్టవచ్చు.
పడిపోతున్న భూగర్భ జలాలు
గ్రేటర్ లోని మూడు జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే గ్రౌండ్ వాటర్ లెవల్స్ తగ్గిపోయాయి. మూడు జిల్లాల్లో 42 ప్రాంతాల్లో పడిపోగా.. 10 చోట్ల మాత్రమే పెరిగాయి. గత నెల చివరలో భారీ వర్షాలు పడినా గ్రౌండ్ వాటర్ స్థాయి గతేడాదిని మించలేదు. రంగారెడ్డి జిల్లాలో 24 మండలాల్లో , మేడ్చల్ లో 12 మండలాల్లో తగ్గాయి. ప్రాంతాల వారీగా చూస్తే గ్రౌండ్ వాటర్ ఒక్కో మీటర్, రెండు మీటర్లు అంతకు ఎక్కువగా లోపలికి వెళ్లాయి. ఈ ఏడాది జూన్తో పోలిస్తే బెటర్గా ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే గ్రౌండ్ వాటర్ భారీగా తగ్గాయి.
మీటర్లు మంచిదే అయినప్పటికీ..
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చే సమయంలో అక్కడ నీరు ఉందా.. లేదా అనేది చూసి ఇవ్వాలె. కమర్షియల్ కాంప్లెక్స్ లు, బిల్డింగ్లు, ఇండస్ట్రీయల్ ప్రాంతాలు, పెద్ద అపార్టుమెంట్లలో నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటిపై ఫోకస్ పెట్టాలి. గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ దగ్గర స్టాఫ్ లేరు. వలంటీర్లుగా మీటర్లు పెట్టుకోవాలని చెబితే ఎవరు స్పందించే అవకాశం లేదు. వాల్టా యాక్ట్ ప్రకారం తహసీల్దార్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వారు గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్కి వివరాలు పంపాల్సి ఉండగా పంపరు. ఈసారి వానలు తక్కువగా పడ్డాయి. దీంతో భవిష్యత్ లో గ్రౌండ్ వాటర్ తగ్గడంపై ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇది వరకు ఇచ్చిన రిపోర్టులు అయినా తప్పుగా ఉండాలి. లేదా ఈసారి రెండు నెలల్లో విపరీతంగా నీరు వాడుకునైనా ఉండాలె. ఇందులో ఏది కరెక్టో వారికే తెలిసి ఉంటుంది.
– దొంతి నర్సింహారెడ్డి, వాటర్ పాలసీ ఎక్స్ పర్ట్స్