- సీఎస్సీ ఈ‑గవర్నెన్స్ డీల్ గురించి తమకు చెప్పలేదన్న సీసీఐ
న్యూఢిల్లీ: తమకు చెప్పకుండా సీఎస్సీ ఈ–గవర్నెన్స్లో వాటాలు కొన్నందుకు యాక్సిస్ బ్యాంక్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.40లక్షల ఫైన్ వేసింది. సీఎస్సీ ఈ–గవర్నెన్స్లో 9.91 శాతం వాటాను యాక్సిస్ బ్యాంక్ నవంబర్ 2020 లో పూర్తి చేసింది. ఈ ట్రాన్సాక్షన్కు సంబంధించి సీసీఐకి బ్యాంక్ తెలియజేయాల్సి ఉంది. కానీ చేయకపోవడంతో తాజాగా ఫైన్ వేశామని ఈ రెగ్యులేటరీ సంస్థ ప్రకటించింది.
ప్రభుత్వ కంపెనీ సీఎస్సీ ఈ–గవర్నెన్స్లో యాక్సిస్ బ్యాంక్ వాటాలు కొనడాన్ని కేవలం ఇన్వెస్ట్మెంట్గాను, సాధారణ బిజినెస్ ట్రాన్సాక్షన్గానూ చూడలేమని తన తీర్పులో పేర్కొంది. అందువలన యాక్సిస్–సీఎస్సీ ఈ–గవర్నెన్స్ డీల్ షెడ్యూల్1లోని ఐటెమ్ 1 (కాంబినేషన్ రూల్స్) కింద అర్హత పొందదని పేర్కొంది. ఈ కేసులో కంపెనీని కంట్రోల్ చేయడానికి అక్విజేషన్ జరిగిందా అనేది ముఖ్యం కాదని తెలిపింది.
‘కాంబినేషన్ రూల్స్ బెనిఫిట్స్ పొందడానికి కొనుగోలు చేయాలనుకునే కంపెనీ బోర్డులో కొనాలనుకుంటున్న కంపెనీ మెంబర్లు డైరెక్టర్లుగా ఉండకూడదు. డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కు కాని, మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయడం కాని చేయకూడదు. కానీ, సీఎస్సీ ఈ–గవర్నెన్స్ బోర్డులో యాక్సిస్ బ్యాంక్ రిప్రెజెంటేషన్ ఉంది. కంపెనీ మేనేజ్మెంట్ అఫైర్స్లో పార్టిసిపేట్ చేయాలని చూస్తోంది.
అందువలన కాంబినేషన్ రూల్స్ బెనిఫిట్స్ పొందడానికి యాక్సిస్ బ్యాంక్కు అర్హత లేదు’ అని సీసీఐ వివరించింది. ఆర్డర్ వెలువడిన 60 రోజుల్లోపు యాక్సిస్ బ్యాంక్ పెనాల్టీ కట్టాలి. ఈ నెల 9 న సీసీఐ ఆర్డర్ ఇచ్చింది. ఈ విషయాన్ని తాజాగా స్టాక్ ఎక్స్చేంజిలకు బ్యాంక్ తెలియజేసింది.