
- కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటాపోటీ ఆహ్వానాలు
- పొంగులేటి, జూపల్లి దారెటు?
- రంగంలోకి రాహుల్ టీం.. పొంగులేటితో మంతనాలు
- జూపల్లికి ఇదివరకే ఫోన్చేసి ఆహ్వానించిన డీకే అరుణ
హైదరాబాద్, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయ అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఈ ఇద్దరి దారెటు అనే దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇద్దరు లీడర్లకు పోటాపోటీగా ఆహ్వానాలు అందుతున్నాయి. పొంగులేటి బీజేపీలో చేరడం ఖాయమని గతంలో ప్రచారం సాగినా ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్యాడర్తో ఆత్మీయ సమ్మేళనాలకే పరిమితమయ్యారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ బహిష్కరించిన మరుసటి రోజే.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయనకు ఫోన్చేసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సైతం ఈ ఇద్దరితో చర్చలు జరిపినట్టు ప్రచారం సాగింది. వీరి చేరికపై పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీ పెద్దలతో చర్చించినట్టుగా ఊహాగానాలు వినిపించాయి. ఇదిలా ఉండగానే సడన్గా రాహుల్గాంధీ టీమ్ రంగంలోకి దిగింది. పొంగులేటితో భేటీ అయింది. ఆయన డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం సాగుతోంది. జూపల్లితోనూ ఢిల్లీ పెద్దలే టచ్లోకి వెళ్లి, తిరిగి సొంత పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.
రెండు పార్టీల గట్టి ప్రయత్నాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కేసీఆర్ను పడగొట్టబోయేది తామేనని ధీమాగా చెబుతున్నది. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని.. బలమైన లీడర్లను చేర్చుకోగలిగితే వాళ్ల స్థాన బలిమితో గెలుస్తామని నమ్మకంగా ఉంది. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లి సహా బీఆర్ఎస్, కాంగ్రెస్లోని అసంతృప్త నేతలపై గురి పెట్టింది. మరోవైపు రాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్పై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. లీడర్లు పార్టీని వీడినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో తమకు సొంత ఓటు బ్యాంకు ఉందని, దీనికి లీడర్ల బలం కూడా తోడైతే అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని నేతలు భావిస్తున్నారు. పొంగులేటి, జూపల్లికి ప్రజాబలం ఉండటంతో పాటు ఆర్థికంగా బలమైన నేతలు కావడంతోనే రెండు పార్టీలు వారిని చేర్చుకోవడంపై దృష్టి సారించాయి.
అన్ని కండిషన్లకు ఓకే!
ఇద్దరు నేతల కోసం రాహుల్గాంధీ టీమ్ రంగంలోకి దిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర, పోదెం వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్న భద్రాచలం మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగతా సీట్లన్నీ పొంగులేటి అనుచరులకు ఇచ్చేందుకు దాదాపు అంగీకరించినట్టు తెలుస్తోంది. తన అనుచరులందరికీ టికెట్లు ఇస్తే కాంగ్రెస్లోకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తానని పొంగులేటి వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. బీజేపీ కూడా పొంగులేటికి దాదాపు అలాంటి ఆఫరే ఇచ్చింది. మరోవైపు జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు డీకే అరుణతో ఆయనకు విభేదాలుండేవి. బీఆర్ఎస్ నుంచి జూపల్లిని సస్పెండ్ చేయడంతో డీకే అరుణనే స్వయంగా ఫోన్చేసి బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అందరం కలిస్తే కేసీఆర్ను గద్దె దించడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ నుంచి జూపల్లికి ఒత్తిడి వస్తోంది. కేసీఆర్ను ఓడించాలన్న లక్ష్యం కాంగ్రెస్లో చేరితేనే నెరవేరుతుందని, ఈ టైంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హస్తం నేతలు సూచిస్తున్నారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలే జూపల్లితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీకి చెందిన ఢిల్లీ నేతలు సైతం వీరిద్దరిని తమ పార్టీలో చేర్చుకోవడంపై సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్లద్దరు ఏ పార్టీలో చేరితే రానున్న రోజుల్లో ఆ పార్టీలోకే మిగతా నేతల వలసలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో రెండు పార్టీల కేంద్ర నాయకత్వాలు పొంగులేటి, జూపల్లిని ఆకర్షించడంపై సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నాయి.
రాహుల్ గాంధీతో రేవంత్, ఠాక్రే భేటీ
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్లో చేర్చుకునే అంశంపై సోమవారం ముఖ్య నేతలు చర్చించారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పార్టీ కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతల సమావేశమయ్యారు. ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన, ఏలేటి మహేశ్వర్రెడ్డి పార్టీని వీడడం సహా పలు అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో రేవంత్, ఠాక్రే సహా పలువురు నేతలు భేటీ అయ్యారు. కర్నాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వెళ్తున్న రాహుల్.. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆగారు. రాహుల్కు రేవంత్, ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నదీమ్ జావెద్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడే రాష్ట్ర రాజకీయాలపై రాహుల్తో చర్చించారు. వీరి మధ్య పొంగులేటి, జూపల్లి ప్రస్తావన వచ్చినట్టుగా నేతలు చెబుతున్నారు.