కబ్జాలు తేల్చకుండా కాంపౌండ్​ ఎలా

కబ్జాలు తేల్చకుండా కాంపౌండ్​ ఎలా

రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటినా యూనివర్సిటీకి కాంపౌండ్ కట్టాలన్న ఆలోచన గత ప్రభుత్వ పెద్దలకు రాకపోవడం దురదృష్టకరం. వర్సిటీ భూములు కబ్జాకు గురి కాకుండా కాంపౌండ్​ వాల్​ నిర్మిస్తం. ఒకట్రెండు రోజుల్లో పనులు కూడా ప్రారంభిస్తాం.' ఈ నెల 10న కేయూలో కాంపౌండ్​ వాల్​ తో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి చెప్పిన మాటలివి.

హనుమకొండ, వెలుగు: కబ్జాకు గురైన కాకతీయ యూనివర్సిటీ  కి చెందిన  రూ.వందల కోట్ల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తులపరం కాగా..  ఆఫీసర్లు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.  కేయూ ల్యాండ్స్​ కమిటీ ఇదివరకే సమగ్ర రిపోర్ట్ తయారు చేసినప్పటికీ రెండేండ్లు దాటినా దానిని ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారు.  క్యాంపస్​ చుట్టూ ఫిజికల్​ సర్వే చేసి, హద్దులు నిర్ణయించాల్సిన అధికారులు, అదంతా ఏమీ చేయకుండానే రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా వర్సిటీ కాంపౌండ్​ నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. రెండు రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామని మంత్రులు ప్రకటించినా.. కబ్జాలు తేల్చకపోవడం, హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో వర్సిటీ భూముల రక్షణకు నిర్మించాల్సిన కాంపౌండ్​ పనులు ఇప్పట్ల స్టార్ట్ అవడం కష్టమేనని స్పష్టమవుతోంది.

కబ్జా వివరాలతో ల్యాండ్​ కమిటీ రిపోర్ట్​

కాకతీయ యూనివర్సిటీ కోసం  1976 లో  హనుమకొండలోని పలివేల్పుల, లష్కర్​ సింగారం, కుమార్​ పల్లి  పరిధిలో మొత్తం   673 ఎకరాల 12 గుంటల భూమి సేకరించారు.   సరైన రక్షణ లేకపోవడంతో   ఆక్రమణలు జరిగాయి. వాటిపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేయగా..  అప్పటి వీసీ   తాటికొండ రమేశ్​  డీజీపీఎస్​  సర్వే చేయించి.  ఆక్రమణలు  గుర్తించారు.

 ఈ సర్వే అనంతరం కేయూ ల్యాండ్స్​ కమిటీ కూడా సమగ్ర సర్వే చేసింది.  పూర్తి వివరాలతో 2021లోనే ఒక నివేదిక తయారు చేసింది.  యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్​ పెండ్లి అశోక్​ బాబుతో పాటు మొత్తంగా 13 మంది కబ్జాకు పాల్పడినట్టు గుర్తించి నివేదికను సమర్పించింది.   కానీ రెండేండ్లు దాటినా ఈ రిపోర్టుపై స్పందన లేదు.    క్యాంపస్ లోపల కూడా ప్రైవేటు వ్యక్తుల పేరున భూములు ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. కేయూ  అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్​  ప్రైవేటు వ్యక్తుల పేరున రికార్డుల్లో ఉండటం గమనార్హం.   

హద్దులు నిర్ణయిస్తేనే కదా.. కాంపౌండ్

డీజీపీఎస్​ సర్వే అనంతరం 2021లోనే కేయూ ల్యాండ్స్​ కమిటీ సమగ్ర రిపోర్ట్ తయారు చేయగా.. ఈసీ మీటింగ్​ లో ఆమోదిస్తే అక్రమార్కులపై యాక్షన్​ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ  వర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్​ అశోక్​ బాబు ఇల్లుతో పాటు మరికొందరి ఆక్రమణలు ఉండటం వల్లే ల్యాండ్స్​ కమిటీ రిపోర్ట్​ ను ఆమోదించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలాఉంటే వర్సిటీ భూములు ఆక్రమణలపై విద్యార్థి సంఘాలు మండిపడుతుండటం, పలుమార్లు నిలదీయడంతో ఈ నెల 10న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్​ రెడ్డి, కేఆర్​ నాగరాజు సమక్షంలో దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో వర్సిటీ చుట్టూ కాంపౌండ్​ నిర్మాణానికి వీసీ ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​ శంకుస్థాపన చేయించారు. అంతా క్లియర్​ గానే ఉందనే ఉద్దేశంతో మంత్రి పొంగులేటి కూడా  రెండు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని కూడా చెప్పారు.

కానీ ఆక్రమణల విషయం ఎటూ తేల్చకుండా కాంపౌండ్​  నిర్మించడం సాధ్యం కాని పనని స్పష్టమవుతోంది. పనులు ప్రారంభించాలంటే హద్దులు ముందుగా నిర్ణయించాల్సి ఉండగా.. ల్యాండ్​ కమిటీ రిపోర్ట్​ ను ఆమోదిస్తేనే ఆ ప్రక్రియకు అడుగులు పడే అవకాశం ఉంది. ముందుగా ఇవన్నీ చేయకుండా  హడావుడిగా శిలాఫలకం వేయించడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి వర్సిటీ భూముల రక్షణ విషయాన్ని అధికారుల ఇంకెన్ని రోజులు లైట్​ తీసుకుంటారో చూడాలి.

ఫిజికల్​ సర్వే చేయాల్సి ఉంది

అడ్మినిస్ట్రేషన్​ బిల్డింగ్​ స్థలం టైటిల్​ ఛేంజ్​ కాకపోవడం, ల్యాండ్​ కమిటీ రిపోర్టు ఇంకా పెండింగ్​ లో ఉన్న విషయం వాస్తవమే. వర్సిటీ భూములకు హద్దులు నిర్ణయించాలంటే ముందుగా ఫిజికల్​ సర్వే చేయాల్సి ఉంది. ఈ మేరకు సర్వే కోసం ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాం. పైనుంచి వచ్చిన ఆదేశాల  మేరకు హద్దులు నిర్ణయించి, వర్సిటీ చుట్టూ కాంపౌండ్​ నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ల్యాండ్​ కమిటీ రిపోర్ట్​ కు ఆమోదం తరువాతే కబ్జాదారులపై యాక్షన్​ ఉంటుంది.   

ప్రొఫెసర్​ పి.మల్లారెడ్డి, రిజిస్ట్రార్, కాకతీయ యూనివర్సిటీ