- జూబ్లీహిల్స్ కేసులో నిందితులకు పెద్దల భరోసా
- పోలీసుల విచారణలో వెల్లడించిన మైనర్లు
- మరో రెండు రోజులు కస్టడీకి నిందితులు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త విష యాలు బయటపడుతున్నాయి. అన్నీ చూస్కుంటామంటూ నిందితులకు పెద్దలు ఇచ్చిన భరోసా పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. అత్యాచారం తర్వాత ఎస్కేప్ ప్లాన్ చెప్పడమే కాకుండా.. కేస్ రిజిస్టర్ అయ్యాక.. చూసుకుంటాంలే అని పెద్దలు ఇచ్చిన భరోసానే మైనర్లను పట్టించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా సోమవారం ఇలాంటి వివరాలనే పోలీసులకు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. కస్టడీలో ఉన్న నిందితులకు కోరుకున్న ఫుడ్ అందుతోందని తెలిసింది. సోమవారం మూడవ రోజు విచారణలో భాగంగా సైదాబాద్లోని జువైనల్హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్కు నిందితులను తరలించారు. విచారణ అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి హోమ్కు తీసుకెళ్లారు. నిందితులను మరో రెండు రోజులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.
ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నలు
కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే కొడుకు, మాజీ ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు సహా మరో ఇద్దరు మైనర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదివారం జరిపిన సీన్ రీ కన్స్ట్రక్షన్, రూట్ మ్యాప్ ఆధారంగా డ్రాఫ్ట్ కాపీ సిద్ధం చేశారు. గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన రోజు బాధితురాలిని వేధింపులకు గురిచేసిన వివరాలను టైమ్ టు టైమ్ రికార్డ్ చేశారు. ఐదుగురు మైనర్లను విడివిడిగా ప్రశ్నించారు. సాక్ష్యాధారాలను మైనర్ల ముందు పెట్టి వివరాలు సేకరించారు. పబ్లో, పబ్ బయట, కాన్సూ బేకరీలో స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వారిని గుర్తించేలా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఎవరి స్టేట్మెంట్పై వారి సంతకాలు తీసుకున్నారు. డ్రగ్, లిక్కర్ తీసుకున్నారా? అనే కోణంలోనూ ప్రశ్నించారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ ఆధారంగా నిందితులు ఆ రోజు ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని గుర్తించారు.
మైనర్ల మధ్య గొవడ?
జువైనల్ హోమ్లో ఆదివారం రాత్రి గొడవ జరిగిందని సోషల్ మీడియాలో సోమవారం ప్రచారం జరిగింది. అత్యాచారం ఘటనకు సంబంధించి నువ్వు అంటే నువ్వే కారణమని మైనర్లు గొడవ పడ్డట్లు తెలిసింది. ఒకరిపై ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు ప్రచారం జరిగింది. ఐతే హోమ్లో ఉన్న మైనర్లు ఎలాంటి గొడవకు దిగలేదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. మైనర్లకు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. డాక్టర్లు చెక్చేసిన టిఫిన్స్, భోజనం మాత్రమే మైనర్లకు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.