అహంకారంతోనే అనుచిత వ్యాఖ్యలు

అహంకారంతోనే అనుచిత వ్యాఖ్యలు
  • దళిత మంత్రులకు బహిరంగ క్షమాపణకు చెప్పాలి​ 
  • ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్​కార్యకర్తలు 

 

దుబ్బాక, వెలుగు: దళిత మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తూ ఆదివారం దుబ్బాకలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను కాంగ్రెస్​ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్​ వెంకట్​స్వామిని వాడు వీడంటూ మాట్లాడడం ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. గడ్డం, దామోదర కుటుంబాలు దేశం, రాష్ట్రాల అభివృద్ధికి పాటు పడ్డాయని, తెలంగాణ ఏర్పాటులో ఇరు కుటుంబాలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. 

కార్పొరేట్​ సంస్థలకు కొమ్ముకాసే ఎమ్మెల్యేకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మంత్రులుగా ఎదిగితే ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. దళితుల పట్ల మీకున్న వంకర బుద్ధి మెదక్​లో జరిగిన రైతు దీక్షలో తేటతెల్లమైందన్నారు. దళిత మంత్రులకు ప్రజల్లో వస్తోన్న ఆదరాభిమానాలను ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. దళిత మంత్రులను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో నాయకులు రవి, ఏసు రెడ్డి, నరేశ్​, శంకర్, రాజిరెడ్డి, శ్రీనివాస్, భరత్, శ్రీనివాస్​గౌడ్, సురేశ్, పద్మయ్య, కమలాకర్​ పాల్గొన్నారు.