- ఎల్ అండ్ టీ చుట్టూ బిగుస్తున్న మేడిగడ్డ ఉచ్చు
- మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం
- మొదటి నుంచీ రిపేర్లు చేసేందుకు ససేమిరా
- బ్యారేజీ కుంగినప్పుడు రిపేర్లు చేస్తామని ప్రకటన
- తర్వాత మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం
- రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని, కంపెనీని
- బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రిపేర్లు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్న ఎల్అండ్టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగు స్తున్నది. 2019లోనే బ్యారేజీ దెబ్బతిన్నప్పటికీ, ఆ రిపేర్లు చేయకుండానే అప్పనంగా బిల్లులు పొందిన ఎల్అండ్టీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకుంటే.. కంపెనీని బ్లాక్లిస్టులో పెట్టాలని భావిస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఎల్అండ్ టీ పొందిన బిల్లులను రికవరీ చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని హెచ్చరించింది.
కాగా, మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) టీమ్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు ఇంజనీర్లతో పాటు ఎల్అండ్టీపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.మేడిగడ్డ బ్యారేజీ కుంగిన టైమ్ లో రిపేర్లు తామే చేస్తామని ప్రకటించిన ఎల్అండ్టీ.. ఆ తర్వాత మాట మార్చింది. డిఫెక్ట్లయబిలిటీ పీరియడ్పూర్తయిందని, ప్రభుత్వం కొత్తగా అగ్రిమెంట్చేసుకుంటేనే రిపేర్లు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఎల్అండ్టీపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
2016లో అగ్రిమెంట్..
మేడిగడ్డ నిర్మాణానికి 2016లో రూ.1,849.31 కోట్లతో టెండర్లు పిలువగా.. ఎల్అండ్టీ–పీఈఎస్జాయింట్ వెంచర్2.7 శాతం ఎక్సెస్కు కోట్చేసి టెండర్దక్కించుకుంది. బ్యారేజీ నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేసేలా 2016 ఆగస్టు 26న ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎల్అండ్టీ అగ్రిమెంట్ చేసుకుంది. నిర్మాణ ఖర్చును 2018లో రూ.3,065.4 కోట్లకు, 2021లో రూ.4,321.44 కోట్లకు పెంచారు. మొత్తంగా బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని ఐదేండ్లలోనే 133.67 శాతం పెంచారు. అయితే గతేడాది అక్టోబర్21న బ్యారేజీ కుంగిపోయింది. ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీమ్ దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డపై విచారణకు ఆదేశించింది.
విజిలెన్స్ అండ్ఎన్ ఫోర్స్మెంట్డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో చేసిన విచారణలో ప్రాజెక్టు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును టెర్మినేట్ చేసిన ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిగతా ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపైనా చర్యలకు సిద్ధమవుతున్నది.
బ్యారేజీ కుంగిన తర్వాత స్పందన..
బ్యారేజీకి రిపేర్లు చేయాలని ఎల్అండ్టీని ప్రాజెక్టు ఇంజనీర్లు ఏండ్ల తరబడి కోరుతూ వచ్చినా, ఆ సంస్థ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ సంస్థ అడిగినట్టుగా నిర్మాణ వ్యయాన్ని పెంచేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రిపేర్లు చేయాలని ఆదేశించలేదు. బ్యారేజీ దెబ్బతినే వరకు స్పందించని ఎల్అండ్టీ.. అది కుంగిపోయిన తర్వాత మాత్రం ప్రాజెక్టు ఇంజనీర్లకు పలుమార్లు లేఖలు రాసింది. ప్రభుత్వం మళ్లీ అగ్రిమెంట్ చేసుకుని నిధులు ఇస్తేనే రిపేర్లు చేపడుతామని 2020లోనే తాము తెలిపామని పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీ నిర్మించామని, ప్రాజెక్టు ఇంజనీర్లు కోరిన పనులు చేయలేమని తేల్చి చెప్పింది.
‘‘2020 జూన్29న బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్టుగా ఇంజనీర్లు సర్టిఫికెట్ఇచ్చారు. ఆ రోజు నుంచి రెండేండ్ల పాటు అంటే 2022 జూన్28న డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయింది. బ్యారేజీ ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ (ఓఅండ్ఎం) పీరియడ్ మాత్రం2025 జూన్28 వరకు ఉంది. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.9.70 కోట్లతో ఓఅండ్ఎం పనులు చేశాం. బ్యారేజీకి సంబంధించిన సివిల్, హైడ్రో మెకానికల్ పనులు 2019 జూన్21న పూర్తి చేశాం. గైడ్బండ్స్, ఫ్లడ్బండ్స్, డైవర్షన్ చానళ్లు, కుదురుపల్లి నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు అప్రోచ్ రోడ్డు, లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్, 3డీ మోడల్ స్టడీస్ (లెఫ్ట్, రైట్ బ్యాంకులవి) పనులు కూడా అదే రోజున పూర్తి చేశాం. ఇరిగేషన్డిపార్ట్మెంట్తో మేం చేసుకున్న అగ్రిమెంట్లో వీఐపీ గెస్ట్ హౌస్, ఏఈఈ, డీఈఈ క్వార్టర్లు, కంట్రోల్ రూమ్కు అప్రోచ్ రోడ్డు, గార్డ్రూమ్, ఫ్యాబ్రికేషన్ అండ్ ఎరిక్షన్ ఆఫ్ గేట్స్ వంటి నిర్మాణాలు లేకున్నా.. ఆ పనులు కూడా చేశాం” అని ఎల్అండ్టీ పేర్కొంది.
ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదు..
మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్ 21న ప్రారంభించగా.. అదే ఏడాది వచ్చిన భారీ వరదలకు లాంచింగ్ అఫ్రాన్, డౌన్ స్ట్రీమ్ అఫ్రాన్లపై ఏర్పాటు చేసిన భారీ సీసీ బ్లాకులు నదిలోకి కొట్టుకుపోయాయి. అదే ఏడాది నవంబర్లో వరద తగ్గిన తర్వాత గేట్లు మూయడంతో ఇది తేటతెల్లమైంది. 2020 మే 18న ప్రాజెక్టు ఇంజనీర్లు బ్యారేజీలో దెబ్బతిన్న సీసీ బ్లాకులు, వియిరింగ్ కోట్ తదితర నిర్మాణాలు పునరుద్ధరించాలని ఎల్అండ్టీకి లేఖ రాశారు. 2021 ఫిబ్రవరి 17న సీసీ బ్లాకులు, వియిరింగ్ కోట్ తిరిగి నిర్మించాలని, అప్రోచ్ రోడ్లు, డైవర్షన్చానల్పై గ్యాంట్రీ క్రేన్లు వెళ్లేలా మెయింటనెన్స్ బే పనులు పూర్తి చేయాలని ఎల్అండ్టీకి ఇంజనీర్లు లేఖ రాశారు. 2022 ఏప్రిల్ 6న సీసీ బ్లాకులు, వియిరింగ్ కోట్ రిపేర్లు చేయాలని, అగ్రిమెంట్లోని మిగతా పనులు పూర్తి చేయాలని మరోసారి లేఖ రాశారు.
2023 ఏప్రిల్28న అప్స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ వియిరింగ్ కోట్ రిపేర్లు చేయాలని, కొట్టుకుపోయిన సీసీ బ్లాకులను యథాస్థానంలో ఏర్పాటు చేయాలని మరోసారి ఎల్అండ్టీని కోరారు. ఏడో బ్లాకులోని 17, 18, 19, 20 వెంట్స్ దిగువన ఏర్పడిన బుంగలను గ్రౌంటింగ్ చేయాలని, లేకపోతే బ్యారేజీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని తెలిపారు. బ్యారేజీ వెంట్స్తో పాటు దిగువన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి వరద సవ్యంగా దిగువకు వెళ్లేలా పనులు చేయాలని కోరారు. కానీ ఈ లేఖలకు ఎల్అండ్టీ స్పందించలేదు.
నిర్మాణ వ్యయం 133% ఎట్ల పెరిగింది?
బ్యారేజీ నిర్మాణ వ్యయం 133 శాతం పెరగడంపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నిర్మాణ వ్యయం ఏటా 5 శాతం పెరిగిందనుకున్నా, మొత్తంగా 25 నుంచి 30 శాతం మాత్రమే పెరగాలని... కానీ ఏకంగా 133 శాతం పెంచడమేంటని? దాని వెనుక ఏదో జరిగిందని అనుమానిస్తోంది. బ్యారేజీ నిర్మాణంలో అసలు నాణ్యతా ప్రమాణాలు పాటించారా? నిర్దేశిత డిజైన్ మేరకే బ్యారేజీ నిర్మించారా? లేదా అనే దానిపై ఫోకస్ పెట్టింది.
ఇప్పటికే శాంపిల్స్సేకరించిన విజిలెన్స్ డిపార్ట్ మెంట్, వాటిని సైంటిఫిక్ స్టడీకి పంపించింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న రెండు కాంట్రాక్టు సంస్థలు.. మేడిగడ్డలో సబ్ కాంట్రాక్టు పనులు చేశాయని, వాటికి ఎల్అండ్టీ నుంచి బిల్లుల చెల్లింపు ఎలా జరిగిందనే దానిపైనా విజిలెన్స్ విచారణ చేపట్టింది. బ్యారేజీ వైఫల్యాలపై ఎన్డీఎస్ఏ ఇచ్చే నివేదికతో పాటు విజిలెన్స్ విచారణలో తేలే మిగతా అంశాల ఆధారంగా ఎల్అండ్టీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. రిపేర్లు చేయకపోతే ఎల్అండ్టీని బ్లాక్లిస్టులో పెట్టి, తెలంగాణలో ఏ టెండర్లలోనూ పాల్గొనకుండా నియంత్రిచనుంది.
అలాగే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి చేసిన పేమెంట్లను రెవెన్యూ రికవరీ యాక్ట్ప్రయోగించి తిరిగి రాబట్టడానికి ప్రయత్నిస్తున్నది. ఇందుకు ఉన్న లీగల్ఆప్షన్లపై స్టడీ చేస్తున్నది. ఎల్అండ్టీ చేసిన తప్పులను అన్ని ఆధారాలతో సహా బయటపెట్టి, ఆ సంస్థకు కార్పొరేట్ కాంట్రాక్ట్ఏజెన్సీలు అండగా నిలువకుండా చూడాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఒకప్పుడు ఎల్అండ్టీకి ప్రతిష్టాత్మక సంస్థగా పేరుండేది. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో ఆ సంస్థ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఆ సంస్థను బ్లాక్లిస్టులో పేడితే, దేశవ్యాప్తంగా ఎల్అండ్టీ చేపట్టే మిగతా పనులపైనా తీవ్ర ప్రభావం పడనుంది.