బెంగళూరు: కర్నాటకలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొడుకు, కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన కామెంట్లు ఆ రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. తాజాగా ఆయన కామెంట్లపై కర్నాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ స్పందించారు. బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్లను నిషేధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే అది బూడిదవుతుందని అన్నారు.
‘ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్ను నిషేధించడం గురించి మాట్లాడారు. కేంద్ర స్థానంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీతో సహా మేమంతా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులం. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు కూడా ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించడానికి ప్రయత్నించారు. కాని అది సాధ్యం కాలేదు. ప్రియాంక్ ఖర్గే ముందు దేశ చరిత్ర గురించి తెలుసుకోవడం మంచిది. ఆయన తన నాలుకను అదుపులో ఉంచుకోవాలి’’ అని నళిన్ కుమార్ కటీల్ హితవు పలికారు.
