మంత్రి పదవులివ్వండి .. ఏఐసీసీ ఇన్​చార్జ్​ మీనాక్షికి ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి విజ్ఞప్తి

మంత్రి పదవులివ్వండి .. ఏఐసీసీ ఇన్​చార్జ్​ మీనాక్షికి ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి విజ్ఞప్తి
  • రాష్ట్ర ఇన్​చార్జ్​తో పార్టీ నేతలు, ఎంపీ అభ్యర్థులు, కార్పొరేషన్ల చైర్మన్ల భేటీ
  • పీసీసీ కమిటీల్లో అవకాశం ఇచ్చినందుకు మంత్రులు సీతక్క, సురేఖ కృతజ్ఞతలు

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ ఇన్​చార్జ్​మీనాక్షి నజరాజన్​తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఆదివారం హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆమెను కలిశారు. ఎమ్మెల్సీ విజయశాంతి సుమారు 15 నిమిషాల పాటు ఆమెతో చర్చించారు. బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆమె కోరారు. అనంతరం మీడియాతో విజయశాంతి చిట్ చాట్ చేశారు. పీసీసీ కమిటీల్లో తన పేరు లేకపోవటంపై మీడియా అడిగిన ప్రశ్నకు.. మిగతా కమిటీల్లో ఉండొచ్చు కదా అని సమధానమిచ్చారు. 

ఎవరికి పదవులు ఇవ్వాలో హైకమాండ్ కు తెలుసని, సరైన టైమ్ లో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయన్నారు. మరో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సైతం మంత్రి పదవి ఇవ్వాలని మీనాక్షి నటరాజన్​ను కోరారు. అలాగే, మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా మీనాక్షిని కలిశారు. పీసీసీ కమిటీల్లో తమకు అవకాశం ఇచ్చినందుకు వారు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేయడంతో ఈ అంశంపై సురేఖతో మీనాక్షి చర్చించినట్టు తెలిసింది. మరో వైపు ప్రభుత్వం, పార్టీ పనితీరుపై తనను కలుస్తున్న నేతల నుంచి ఆమె ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల మధ్య గ్యాప్ పైనా, పార్టీ బలోపేతం కోసం ఏం చేశారన్న విషయాలను చెప్పాలని నేతలను మీనాక్షి కోరుతున్నారు.  

ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ 

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి భేటీ అయ్యారు. ఈ మీటింగ్​లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు, మెదక్ నుంచి  నీలం మధు ముదిరాజ్, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పాల్గొన్నారు. అలాగే, సికింద్రాబాద్, హైదరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గాల నేతలతోనూ సమావేశమయ్యారు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్పొరేషన్ చైర్మన్లతో మీనాక్షి సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చ జరిగిందని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ మీటింగ్ అనంతరం మీడియాకు తెలిపారు.

 గత పదేండ్లలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం ఉంటుందని సెక్రటరీ హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ స్కీమ్​లను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? లేదా? అని ఆరా తీశారని తెలిపారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలని, అందరి అభిప్రాయాలు తీసుకోవాలని సెక్రటరీని కోరామని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సమానంగా కార్పొరేషన్ చైర్మన్లకు ప్రొటోకాల్ ఇవ్వాలని కోరామని, ఈ అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని మీనాక్షి తెలిపారని వారు వెల్లడించారు.