
- అధికారం పోయినా అహంకారం తగ్గలేదు
- మెదక్ ప్రజల మనోభావాలు దెబ్బతిస్తే సహించం
- మెదక్ ప్రజలు గాడిదలన్న కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలి
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతిసేలా మాట్లాడిన కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ భవన్ లో మెదక్ ప్రజలు గాడిదలన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం కాంగ్రెస్ నేతలు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావును కలిసి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలాంటూ వినతిపత్రం సమర్పించారు.
వారు మాట్లాడుతూ.. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదన్నారు. కాంగ్రెస్ అంటేనే త్యాగాల పార్టీ అని, దేశానికి స్వాతంత్యం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన వేధింపులకు నేటికీ కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి కేటీఆర్ మెదక్ జిల్లా ప్రజలను గాడిదలతో పోల్చడం సరికాదన్నారు. తెలంగాణలో మాట్లాడలేని భాషను క్రియేట్ చేసిందే కేసీఆర్అన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి ఫ్యామిలీ అంటేనే సేవ చేసే ఫ్యామిలీ అని వారిని విమర్శిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెబుతామన్నారు. నియోజకవర్గంలో అవినీతికి పాల్పడి వందల ఎకరాల భూములు, వందల కోట్లు ఎవరు సంపాదించారో మెదక్ ప్రజలకు తెలుసన్నారు.
వెనుక పడేసిన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకేళ్లేందుకు ఎమ్మెల్యే రోహిత్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్ చౌదరి, పవన్, శ్రీనివాస్, ఆంజనేయులు గౌడ్, ముత్యంగౌడ్, గంగాధర్, అశోక్, లల్లూ, లక్ష్మీనారాయణ, దుర్గ ప్రసాద్, మహేందర్ రెడ్డి, శంకర్, లింగం, శ్రీకాంత్, కృష్ణ, రమేశ్ గౌడ్, బానీ ఉన్నారు.