
- రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్
గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికే అవకాశాలు వస్తాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారు ప్రజల్లో తిరగాలని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. బుధవారం ఎన్టీపీసీలోని ఓ కన్వెన్షన్ హాల్లో రామగుండం నియోజకవర్గ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ అజ్మతుల్లా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ తనతో ఉన్నవారెవరో, మోసం చేసిందెవరో తెలుసన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ అబ్జర్వర్ సంగీతం శ్రీనివాస్, మాజీ మేయర్లు బంగి అనిల్ కుమార్, జాలి రాజమణి, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, మహంకాళి స్వామి, లింగస్వామి పాల్గొన్నారు.