ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో  ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

వెలుగు, నెట్​వర్క్: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి సంబురాలు చేసుకున్నారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల దూరదృష్టితోనే దేశం అభివృద్ధి చెందుతోందని పార్టీ నేతలు పేర్కొన్నారు.

 పాలమూరు కాంగ్రెస్​ ఆఫీస్​లో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్  ముదిరాజ్, ఎమ్మెల్యే జి మధుసూదన్​రెడ్డితో కలిసి జెండా ఎగురవేశారు. పార్టీలో గ్రూపులకు తావు లేదని, పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని డీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు.

 గ్రూపులు పెట్టాలనుకుంటే పక్కకు వెళ్లాలని సూచించారు. పార్టీ జెండాలు మోసిన వారికి అండగా ఉంటామని తెలిపారు. అనంతరం పార్టీ ఆఫీస్​ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తీసివేయదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒబేదుల్లా కొత్వాల్, లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్  అనిత, మాజీ మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, జహీర్ అఖ్తర్, సురేందర్ రెడ్డి, అమరేందర్ రాజు, సీజే బెనహర్  పాల్గొన్నారు.

వనపర్తిలో డీసీసీ అధ్యక్షుడు, స్పోర్ట్స్​ అథారిటీ చైర్మన్​ శివసేనారెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. ఏఎంసీ చైర్మన్​ శ్రీనివాస్​గౌడ్, నాయకులు యాదయ్య, శంకర్ ప్రసాద్, ధనలక్ష్మి, చంద్రమౌళి,  ఎస్ఎల్ఎన్​ రమేశ్, శ్రీనివాసరెడ్డి, కె.వెంకటేశ్​ పాల్గొన్నారు.

గద్వాలలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్​పర్సన్  సరిత వేర్వేరుగా జెండా ఎగురవేశారు. కాంగ్రెస్  ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్నివర్గాల ప్రజలకు మేలు చేసిందని తెలిపారు.

వంగూరు, చారకొండ మండలాల్లో కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సర్పంచ్  యాదయ్య, రమేశ్ గౌడ్, రాజు, సత్యనారాయణ,కృష్ణ పాల్గొన్నారు.

కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా  జరుపుకున్నారు. కాంగ్రెస్​ జెండా ఎగురవేసి దేశానికి సేవలందించిన నేతలను స్మరించుకున్నారు. నరసింహ, బాలరాజు, జూపల్లి రఘుపతిరావు, దడివేల రామన్ గౌడ్, ఎర్ర శీను పాల్గొన్నారు.

పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లో పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్​ జెండా ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్  పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. సూర్య ప్రతాప్ గౌడ్, బండారి విష్ణు, జగన్మోహన్, రాజు, శంకర్  పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి కాంగ్రెస్  జెండాను ఎగురవేశారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్  నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం నాగర్ కర్నూల్  మున్సిపాలిటీ పరిధిలోని నెలికొండలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును ప్రారంభించారు.