సిటిజన్​షిప్​పై కాంగ్రెస్ అప్పుడు సై.. ఇప్పుడు నై

సిటిజన్​షిప్​పై కాంగ్రెస్ అప్పుడు సై.. ఇప్పుడు నై

దేశంలో ఒక వర్గం సీఏఏపై భగ్గుమంటోంది. గతంలో ఎవరూ చేయని ఆలోచన మోడీ సర్కారు చేశారని చెబుతోంది. నిజానికి, ఈ అమెండ్​మెండ్​కి విత్తనం వేసింది ప్రతిపక్షాలే! 2003 లోనే అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ చాలా సూచనలు, సవరణలు  ప్రతిపాదించింది. 2012లో ఇతర దేశాల్లో మైనారిటీలైనవాళ్ల సమస్యను పాజిటివ్​గా పరిష్కరించమని ప్రధాన మంత్రికి సీపీఎం లేఖ రాసింది. మన్మోహన్​ సింగ్​ ప్రభుత్వం చేయని పనిని మోడీ సర్కారు పూర్తి చేసింది.

సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​–2019పై దేశంలో కొన్ని వర్గాలు బాగా యాంటీ కేంపయిన్​ నడుపుతున్నాయి. ఈ యాక్ట్​ పార్లమెంట్​లో పాసయిన కొద్ది రోజులకే నేషనల్​ పాప్యులేషన్​ రిజిస్టర్​ (ఎన్పీఆర్​)కూడా రావడంతో కేంపయన్​ మరీ జోరందుకుంది. సీఏఏ​తో ఇండియా చుట్టుపక్కలగల మూడు దేశాల నుంచి వచ్చేసిన ఆరు మతాలవాళ్లకు రూల్స్​ ప్రకారం సిటిజెన్​షిప్​ ఇస్తారు. దీనిలో ఆ యా దేశాల నుంచి వచ్చే ముస్లింలెవరికీ సిటిజెన్​షిప్​ ఇవ్వరు. ఇక, ఎన్పీఆర్​ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్ మధ్యలో డోర్​–టు–డోర్​ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఈ వివరాలను అడ్డం పెట్టుకుని దేశంలో ఇప్పటికే  ముస్లింలను జల్లెడ పట్టేసి గెంటేస్తారనే దుర్మార్గమైన ప్రచారం బాగా సాగుతోంది. అయితే, ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. ఇది కొత్తగా తెచ్చిన యాక్ట్​ కాదు. పాత యాక్ట్​కి సవరించిన కొత్త చట్టం.

2003లో అప్పటి వాజ్​పేయి ప్రభుత్వం సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ బిల్లుని ప్రతిపాదించింది. హోం మంత్రి హోదాలో ఎల్​.కె.అద్వానీ బడ్జెట్​ సెషన్​లో ప్రవేశపెట్టారు. దానిని పరిశీలనకోసం హోం వ్యవహారాలపై ప్రణబ్​ ముఖర్జీ నాయకత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీకి పంపారు. ముఖర్జీ అప్పట్లో కాంగ్రెస్​ పార్టీ రాజ్యసభ సభ్యులు. ఈ కమిటీ మెంబర్లుగా కపిల్​ సిబాల్​, లాలూ ప్రసాద్​ యాదవ్, ప్రమోద్​ మహాజన్​, రామ్​ జెఠ్మలానీ తదితర 14మంది రాజ్యసభ సభ్యులు; కరుణాకరన్​, పి.ఏ.సంగ్మా, వినయ్​ కతియార్​ వంటి 26 మంది లోక్​సభ సభ్యులు ఉన్నారు. ఈ బిల్లుకుగల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలనుంచి, సంస్థల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. అన్ని మెయిన్​ ఇంగ్లిష్, హిందీ పేపర్లలోనూ, ప్రాంతీయ భాషా పత్రికల్లోనూ ప్రకటనలిచ్చి బిల్లులోని అంశాలపై అభిప్రాయాలను సేకరించింది.

పార్లమెంటరీ కమిటీ ప్రకటన తర్వాత వచ్చిన అనేక అభిప్రాయాల్లో ముఖ్యమైనవి ఇవీ:

బంగ్లాదేశ్​, పాకిస్థాన్​ల నుంచి వచ్చిన మైనారిటీ రెఫ్యూజీలకు ఇండియన్​ సిటిజెన్​షిప్​ ఇవ్వాలి. వాళ్లందరికీ నేషనల్​ ఐడీ కార్డులుకూడా జారీ చేయాలి.

 1971 యుద్ధమప్పుడు ఇండియాకి వచ్చేసినవాళ్లకు సిటిజెన్​షిప్​ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి.

 కొన్ని దేశాలకు సంబంధించి అక్కడి ఎన్నారైలకు డ్యూయల్​ సిటిజెన్​షిప్ అందజేయాలి.

 బంగ్లాదేశ్​లో మైనారిటీలుగా ఉన్నవారు ఇండియాకి వచ్చేసినట్లయితే… అలాంటివాళ్లకు సిటిజెన్​షిప్   కల్పించాలి. బంగ్లాలో మెజారిటీ అయినవాళ్లు మన దేశానికి వస్తే పౌరసత్వం ఇవ్వరాదు.

 టిబెటన్ రెఫ్యూజీలకు (బౌద్ధులకు) సిటిజెన్​షిప్​ కల్పించాలి.

 ప్రతి ఒక్క ఇండియన్​ సిటిజెన్​కి ఉచితంగా నేషనల్​ ఐడీ కార్డు ఇవ్వాలి.

 ప్రతి సిటిజెన్​షిప్​ సర్టిఫికేట్​ పైన సదరు కార్డు హోల్డర్​ ఏ మతానికి చెందినవారనేది ఉండాలి.

ఇలాంటి విజ్ఞాపనలన్నీ తీసుకున్న తర్వాత ప్రణబ్​కమిటీ రిపోర్ట్​ అందజేసిన తర్వాత  డిసెంబర్​ 2003లో పార్లమెంట్​కి మళ్లీ బిల్లు వచ్చింది. డిసెంబర్​ 18న ఏకగ్రీవంగా ఆమోదించగా, డిసెంబర్​ 22న ఎలాంటి అవరోధాలు లేకుండా (వితవుట్​ ఎనీ ఆక్రోమనీ) లోక్​సభ ఓకే చేసింది. వాజ్​పేయి ప్రభుత్వం తెచ్చిన ఈ సవరణ బిల్లుకి కాంగ్రెస్, అన్నాడీఎంకే, ఆర్జేడీ సహా ఇతర ప్రతిపక్షాలన్నీ మద్దతు పలికాయి.

సీఏఏ–2003ని ప్రవేశపెట్టే సమయానికి రాజ్యసభలో కాంగ్రెస్​ లీడర్​గా మన్మోహన్​ సింగ్​ ఉన్నారు. ఆయన బిల్లుపై చర్చిస్తూ… ‘బంగ్లాదేశ్​లో వేధింపులకు గురైన మైనారిటీల విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించాలి. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్​ లాంటి దేశాల్లో ఉండిపోయిన అక్కడి మైనారిటీలు హింసకు, వేధింపులకు గురయ్యారు. ఇలాంటి దురదృష్టవంతులు మన దేశంలో ఆశ్రయం కోరినప్పడు వాళ్లకు లిబరల్​(ఉదారం)గా సిటిజెన్​షిప్​నివ్వాలి’ అన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్​పర్సన్​గా ఉన్న నజ్మా హెఫ్తుల్లా… బిల్లులో పాకిస్థానీ మైనారిటీల్నికూడా కలపాలని సూచించారు. ఈ అభిప్రాయాలను హోం మంత్రి అద్వానీ పరిగణనలోకి తీసుకుని ‘ఇల్లీగల్​ ఇమిగ్రెంట్​ (చొరబాటుదారు)’కు, ‘బోనఫైడ్​ రెఫ్యూజీ (అర్హుడైన శరణార్థి)’కి మధ్య తేడాల్ని వివరించారు. ‘మత పరమైన కారణాలతో హింసకు గురై అక్కడి నుంచి పారిపోయి వచ్చేసినవాళ్లు బోనాఫైడ్​ రెఫ్యూజీలు అవుతారు. వాళ్లను అక్రమంగా చొరబడినవాళ్లతో (ఇల్లీగల్​ ఇమిగ్రెంట్లతో)కలిపి చూడలేం’ అన్నారు అద్వానీ.

సీఏఏ–2003 ఇల్లీగల్​ మైగ్రాంట్ల గురించే ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఎవరెవరిని అక్రమ చొరబాటుదారులుగా చూడాలి, ఎవరెవరిని సిటిజెన్​షిప్​కి అర్హులుగా గుర్తించాలి వంటి అంశాలకే పరిమితమైంది. అయితే, ఈ సవరణలో తొలిసారిగా నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజెన్స్​ (ఎన్నార్సీ)ని దేశమంతా అమల్లోకి తీసుకురావాలని, ప్రతి ఒక్క ఇండియన్​ సిటిజెన్​కి జాతీయ ఐడీ కార్డు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనికోసం అసలు యాక్ట్​ (ఇండియన్​ సిటిజెన్​షిప్​ యాక్ట్​–1950)లోని సెక్షన్​ 14లో కొన్ని క్లాజ్​లు చేర్చారు.

  •      ప్రతి సిటిజెన్​ వివరాలను కచ్చితంగా నమోదు చేసి, ఐడీ కార్డు ఇవ్వాలి.
  •      ఈ వివరాల సేకరణకోసం నేషనల్​ రిజిస్ట్రేషన్​ అథారిటీ (ఎన్నారే) ఏర్పరచాలి.

కొత్త చట్టం వెనుక….

సిటిజెన్​షిప్​ యాక్ట్​–2003 అమల్లోకి వచ్చాక కొన్ని రాష్ట్రాల్లో ఇల్లీగల్​ ఇమిగ్రెంట్లను ఏరేయడం మొదలైంది. 2005లో ఒడిశాలోని నవీన్​ పట్నాయక్​ ప్రభుత్వం 1551 మందిని బంగ్లాదేశీయులుగా గుర్తించింది. వీళ్లంతా మహాకల్పద ఏరియాలో ఉంటున్న నామశూద్ర మథువా కమ్యూనిటీవాళ్లు.  అదే ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బంగ్లా ముస్లింలుకూడా ఉంటున్నా పట్నాయక్​ ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.  ఈ సమస్యపై కాంగ్రెస్​, సీపీఎం స్పందించాయి. ఇతర దేశాల్లో మైనారిటీలైనవాళ్ల సమస్యను సానుకూలంగా చూడాలని 2012లో సీపీఎం నాయకుడు ప్రకాశ్​ కరత్​ అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​కి రాశారు.  అప్పటి అస్సాం ముఖ్యమంత్రి తరుణ్​ గగోయ్​ ప్రధానికి ఒక మెమొరాండం ఇచ్చారు. ‘మతపరమైన వేధింపులవల్ల మన దేశానికి పారిపోయి వచ్చినవాళ్లను ఫారినర్లుగా చూడవద్ద’ని గగోయ్​ కోరారు. దీనిపై మన్మోహన్​ సింగ్ చర్యలు తీసుకోలేదు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2015 సెప్టెంబర్​లో ఫారినర్స్​ యాక్ట్​–1946ని సవరించింది. 2014 డిసెంబర్​ కంటే ముందు ఇండియాకి వచ్చేసిన పాకిస్థానీ, బంగ్లాదేశీ మైనారిటీలను ‘ఇల్లీగల్​ ఇమిగ్రేంట్స్​ (అక్రమ చొరబాటుదారులు)’గా పరిగణించకూడదని, దీర్ఘకాల వీసాకి అర్హులుగా గుర్తించాలని మోడీ సర్కారు స్పష్టం చేసింది. దీనినే ఫారినర్స్​ అమెండ్​మెంట్​ ఆర్డర్–2015 అంటారు.

2016లో అప్పటి హోం మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సిటిజెన్​షిప్​ సవరణ బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు కొన్ని అభ్యంతరాలు చెప్పాయి.  ఆ బిల్లునే మళ్లీ పోయినేడాది డిసెంబర్​ 11న పార్లమెంట్​ ఆమోదించింది.