ఖమ్మం, వెలుగు : తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో దక్షిణ తెలంగాణ జిల్లాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం వచ్చిన సీట్లలో సగం సీట్లను ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే ఆ పార్టీ గెలుచుకుంది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లోనే 32 సీట్లను కాంగ్రెస్ కూటమి సాధించింది. 31 సీట్లలో కాంగ్రెస్అభ్యర్థులు గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఫలితాలను పునరావృతం చేస్తూ పది స్థానాలకు గాను ఒక్క చోట మాత్రమే బీఆర్ఎస్అభ్యర్థి విజయం సాధించారు. మిగిలిన 9 చోట్ల కాంగ్రెస్ కూటమి గెలిచింది. 8 చోట్ల కాంగ్రెస్, మరో చోట సీపీఐ అభ్యర్థి విన్ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ12 సీట్లలో సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన11 సీట్లలో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలో14 సీట్లకు గాను 2 సీట్లతో బీఆర్ఎస్ సరిపెట్టుకోగా, మిగిలిన12 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
గత బీఆర్ఎస్ అధికారంలోనూ ఇవే కీలకం
2018 ఎన్నికల్లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు కీలకమయ్యాయి. అప్పట్లో ఈ రెండు జిల్లాల్లోనూ ఆ పార్టీ మెజార్టీ సీట్లను గెలుపొందింది. మహబూబ్ నగర్ జిల్లాలో13 చోట్ల బీఆర్ఎస్, ఒక చోట కాంగ్రెస్ అభ్యర్థి గెలవగా, ఎన్నికల తర్వాత ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్లో చేరారు. ఇక నల్గొండ జిల్లాలో12 స్థానాలకు గత ఎన్నికల్లో 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. 9 సీట్లలో బీఆర్ఎస్ విన్ అయింది. ఆ తర్వాత ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో చేరగా, మునుగోడు, నాగార్జున సాగర్ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం గత ఎన్నికల్లో మాదిరి ఈసారి కూడా బీఆర్ఎస్కు ఒక్క సీటే వచ్చింది. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో నలుగురు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు, ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యే ఒకరు మొత్తం ఏడుగురు బీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో మళ్లీ ఒక్క సీటుతోనే బీఆర్ఎస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భాగమైన రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కు10, కాంగ్రెస్కు 6 సీట్లు రాగా, హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్ బోణి కొట్టలేదు. ఏడు చోట్ల బీఆర్ఎస్, 7 చోట్ల ఎంఐఎం, ఒక చోట బీజేపీ గెలిచింది.