రాజ్యాంగ పీఠికే మన మంత్రం

రాజ్యాంగ పీఠికే మన మంత్రం

మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనీకరించి, ఆమోదించి, మనకు మనం సమర్పించుకున్నాం. మనం అంటే ఎవరు? మనం అంటే ఢిల్లీలో రాజ్యాంగంలో నిర్మించిన చుట్టూ ఉన్న మనమా? ఈ దేశం మనమా?1950 నాటి రోజుల్లో ఉన్న మన కోట్లాది మానవ దేవుళ్లా? లేక ఈ రోజు బతుకుబాట వెతుక్కుంటున్న మనం మామూలు మానవులమా? అంటే మనమే అందరం.

మొదట్లో భారత్‌ను సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అయితే, 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది. 1776లో అమెరికన్ రాజ్యాంగ పీఠిక అమెరికా స్వతంత్ర ప్రకటనలో కీలకమైన భాగం.  రాజ్యాంగానికి పీఠిక గుర్తింపు కార్డు వంటిదని శంకరీ ప్రసాద్ కేసులో (1952) జస్టిస్ హిదయతుల్లా పేర్కొన్నారు.  విచిత్రమేమంటే పీఠిక మన రాజ్యాంగంలోని అంతర్భాగమా లేక బయట ఉన్న ఒక పేజీయా అని పేచీ వచ్చింది. ఈ అంశాన్ని బాగా విచారించి, సుదీర్ఘమైన వాదోపవాదాలు విన్న తరువాత న్యాయమూర్తుల ధర్మాసనం కేశవానంద భారతి కేసులో పీఠిక రాజ్యాంగంలోని అంతర్భాగమే అని తీర్పు చెప్పింది. అంతకుముందు సుప్రీంకోర్టు పీఠిక అంతర్భాగం కాదన్నది. ఇంకాపీఠికలో ఉన్న హక్కులకు భంగకరమైన నియమాలు, లక్ష్యాలను అడ్డుకునే నియమాలు కొన్ని మొదటి నుంచీ ఉండడం, మరెన్నో తరువాత కాలంలో వచ్చి చేరడం జరుగుతుండడం గమనార్హం. 

కుల, మతాల చట్రాలను ఛేదించాలి

‘మరో ప్రపంచం..మరో ప్రపంచం..మరో ప్రపంచం పిలిచింది!. పదండి ముందుకు’ అని శ్రీశ్రీ పిలిచినట్టు మనం చేసుకున్నది పీఠిక సామాజిక ఒప్పందం. భారత ప్రజలు చేసుకున్న సామాజిక ఒప్పందమే ఈ పీఠిక. ఇందులో విలువలను కాపాడడానికి మనం దీక్షాబద్ధులం కావాలి. పౌరుడిని చైతన్యవంతుడైన సహేతుకమైన, స్వేచ్ఛాయుతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయాలి. మనం ఇంకా కుల, మతాల చట్రాలలోంచి, చట్టాలలోంచి బయటకు రాలేదు. మన ఎన్నికలన్నీ కుల, మతాలకు చెందిన ఓట్లను ప్రేరేపించడంతోనే మొదలవుతున్నాయి..ముగుస్తున్నాయి. 75 ఏండ్ల స్వాతంత్ర్యం తరువాత మనం సామాజిక అభివృధ్ధి, ప్రజాస్వామ్య విలువల వంటి విధానాలు చూడడం లేదు.  తాతల నాటి కట్టడాలు ఘన కార్యక్రమం అన్నట్టు చూపి, సంస్కృతిని బూచిగా మార్చి, మతాన్ని కులాన్ని నిత్యం వల్లిస్తూ ద్వేషం కురిపిస్తున్నాం. మానవత్వానికి చాలా దూరంగా సాగిపోతూ మత్తిచ్చి, డబ్బిచ్చి, అబద్ధాలు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నాం, కొనుక్కుంటున్నాం. అమ్ముకుంటున్నాం. చారిత్రక విభాత సంధ్యల మానవకథ వికాసమెట్టిది?. ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం?. ఏ శిల్పం? ఏ సాహిత్యం?. ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?. ఏ వెలుగులకీ ప్రస్థానం?. ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?.  శ్రీశ్రీ చెప్పినట్టు ‘ఈ దేశం, ఈ కాలం’ మనదే.  అదే కావాలి. కానీ, ఈ దేశం, ద్వేషం కాకూడదు. కాదే కాదు, అనేది మన పీఠిక. మనం మంత్రం. మన తంత్రం. 

ఏది గొప్పది? 

పత్రికలు, టీవీల వాడుక భాషలో మనం కేంద్రం అనేమాట వాడుతున్నాం. రాజ్యాంగంలో కేంద్రం అనేమాటే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కేంద్రం అనేపదం మిథ్య అనేవారు. రాష్ట్రాలు లేకపోతే దేశం ఎక్కడ అనే వారు? అన్ని రాష్ట్రాల హద్దులన్నీ కలిపితేనే ఈ దేశం అని కూడా  వాదించేవారు. మనదేశ రాజ్యాంగం ప్రకారం కేంద్రం గొప్పదా?  రాష్ట్రం గొప్పదా?  అందరూ తడుముకోకుండాచెప్పే సమాధానం కేంద్రం గొప్పదని.  గొప్పదంటే ఏమిటి?. ఎక్కువ అధికారాలున్నాయనా? పెద్దదనా? కాదు. ఎన్నికల ద్వారానే ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సమానమే కదా. సమానమే కానీ, కేంద్రం ఎక్కువ సమానం. ఎందుకంటే దేశ రక్షణ, విదేశీ వ్యవహారాల నిర్వహణ, కమ్యూనికేషన్లు ఇవన్నీ యూనియన్ ప్రభుత్వమే నిర్వహించాలి. ఇందులో రాష్ట్రాలకు ప్రమేయమే లేదు. యూనియన్ లిస్ట్ అని ఏడో షెడ్యూల్ లో కొన్ని అంశాలపైన పాలనాధికారాలను, శాసనాధికారాలను ప్రత్యేకించి యూనియన్ కే పరిమితం చేశారు. 

కేంద్రం మిథ్య?

యూనియన్ అంటే సంఘం. సంఘ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది. హిందీలో రాష్ట్రం అంటే దేశం. రాష్ట్రపతి అంటే దేశాధ్యక్షుడని తెలుగులో కూడా ఒప్పుకుంటాం, కానీ, వాడుకలో రాష్ట్రం అంటే ద్వితీయ స్థాయి పాలనా ప్రదేశం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటాం. రాజనీతిపరంగా, రాజ్యాంగ వాడుకలో స్టేట్ అంటే వేరే అర్థం ఉంది. స్టేట్ అంటే రాజ్యం అని, దేశ పాలనా వ్యవస్థ అని అర్థం. మార్గదర్శకంగా ఉండే ఆదేశిక సూత్రాలలో స్టేట్ సమానతను సాధించడానికి, పేద, ధనిక వ్యత్యాసాలు తగ్గించడానికి కృషి చేయాలన్న సూత్రం ఒకటి ఉంది. స్టేట్​ను మనం తెలుగులో ఇతర భాషల్లో కూడా ఫలానా రాష్ట్రం అనే అర్థంలో వాడతాం. విచిత్రంగా రాజ్యం రాష్ట్రమైంది. రాష్ట్రం దేశమైంది. దేశం కేంద్రమైంది. రాష్ట్రం, కేంద్రం దగ్గర నిలబడి నిధులు అభ్యర్థించే ప్రజా ప్రభుత్వమైంది. రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాజనీతి శాస్త్రానికి అనుగుణంగా వాడిన కీలక పదాలను అర్థం చేసుకోకుండా మన వాడుక పదాలతో గందరగోళం సృష్టిస్తున్నాం. న్యాయపరిభాషలో ఈ పద్ధతి సమస్యలు తెస్తుంది. 

దేశం అంటే సంఘం

ద్వేషపు విషాలు విరజిమ్మే నేతలకు రాజ్యాంగ పాఠాలు చెప్పవలసిన అవసరం ఉంది. భారత్ ఒక సంఘం. విద్వేష కేంద్రం కాదు అనేది తొలిపాఠం. నిజానికి కేంద్రం అన్నమాటే రాజ్యాంగంలో లేదు. ఢిల్లీలో ఉన్న జాతీయ ప్రభుత్వానికి సంఘం అని రాజ్యాంగం అంటుంది. దేశం అంటే సంఘం. సంఘం అంటే కలిసి ఉండడం. మనం విద్వేష, ఉద్వేగ, ఉద్రేక వాక్యాలతో జాతిని విభజించి భజనలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుత సమయంలో రాజ్యాంగం దేశాన్ని సంఘం అన్నదని తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. మనం జాతి అంటూ ఉంటాం. నేషనల్ అన్న పదానికి తెలుగులో మనం జాతీయ అని అర్థం చెప్పుకుంటున్నాం. హిందీలో జాతి అంటే కులం. రాష్ట్రీయ ఏకతా అంటే జాతీయ సమైక్యత. ఈ విధంగా మన దేశ భక్తి భావాలను రకరకాల పదాలతో వాడుతూ మన దేశాన్ని గందరగోళంలో పడేస్తున్నాం. మన నాయకుల సంగతి మరీ దారుణం. చంపండి, నరకండి అని తెలుగు సినిమా ఫ్యాక్షన్ కథల హత్యాకాండ పరిభాషను తలపించే విధ్వంసక భాషను నాయకులు వేదికలమీద వాడుతున్నారు. ఇది నేర భాష. ద్వేష విధానం. ఈ విధంగా మాట్లాడేవారు దేశద్రోహులు. జైళ్లలో ఉండవలసినవారు మైకుల్లో మాట్లాడుతున్నారు. 

-డా. మాడభూషి శ్రీధర్ ఆచార్యులు,ప్రొఫెసర్​ ఆఫ్​ లా