కొందరు రెగ్యులర్గా కాకపోయినా… ఇంట్లో పండుగలప్పుడో.. వేడుకలప్పుడో.. చుట్టాలు, దోస్తులతో కలిసి కూల్డ్రింక్స్ తాగుతారు. ఇంకొందరు మాత్రం ఆకలేసినా, దాహమేసినా, బోర్ కొట్టినా… మూడ్ని బట్టి కూల్డ్రింక్స్ తాగుతూనే ఉంటారు. అయితే అవి ఆరోగ్యానికి మంచిది కాదంటూ… కేన్సర్లు వస్తున్నాయంటూ స్టడీస్ చెప్తున్నాయి. ఒక్క కూల్డ్రింక్సే కాదు… ఇంట్లో చేసిన మామిడి, ఆకు పచ్చ ద్రాక్ష, సపోటా వంటి పండ్ల రసాలైనా ఎక్కువగా తీసుకుంటే కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట.
ఒక్క కూల్డ్రింక్స్, సోడాలే కాదు… చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఫ్రూట్ జ్యూస్, టీ, కాఫీలు తాగినా ముప్పే. ఒక మనిషి రోజుకు తీసుకోవాల్సిన దానికంటే… ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎక్కువ చక్కెర తీసుకుంటే కేన్సర్ వచ్చే అవకాశాలు 18 శాతం పెరుగుతాయంటున్నారు పరిశోధకులు. పండ్ల రసాల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి రోగనిరోధకశక్తిని పెంచి, గుండె సమస్యలను అరికడతాయి. అందుకే మొత్తానికే తీసుకోవద్దని కాదు కానీ… ఏదైనా సరే తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.
సర్వే ఎలా జరిగింది?
మొత్తం లక్షమందిని సంప్రదించి ‘ ఫ్రెంచ్ న్యూట్రినెట్ శాంటీ’ అనే వెబ్సైట్ ఈ సర్వే చేసింది. అందులో 79శాతం మహిళలు, 21శాతం మంది పురుషులు పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా ఎవరెవరు రోజులో ఎంతశాతం చక్కెర తీసుకుంటున్నారో తెలుసుకుని అంచనా వేశారు. అంతేకాదు, వ్యాయామం, గతంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు, ధూమపానం, వయసు, చదువు మొదలైన వివరాలతో పాటు ఆహారపు అలవాట్లు కూడా తెలుసుకున్నారు. అందులో షుగరీ డ్రింక్స్ ఎక్కువగా తాగే వాళ్లలో… చాలామంది కేన్సర్ బారినపడ్డట్లు సర్వేలో వెల్లడైంది. ఇంకొంతమంది గుండె సంబంధిత వ్యాధులు, టైప్–2 డయాబెటిస్, ఒబెసిటీతో బాధ పడుతున్నట్లు తెలిసింది. వాళ్లందరిలో మొత్తం 2,193 కేన్సర్ కేసులు ఉన్నాయి. 693 మంది బ్రెస్ట్ కేన్సర్, 291 మంది ప్రొస్టేట్ కేన్సర్, 166 మంది కొలరెక్టల్ కేన్సర్తో బాధపడుతున్నట్లు ఆ సర్వే చెప్తోంది. వీళ్లందరికీ షుగరీ డ్రింక్స్… అంటే అధిక చక్కెర కలిగిన జ్యూస్లు, డ్రింక్స్ తీసుకునే అలవాటు ఉందని తేలింది.
భయపడాల్సిన పని లేదు..
ఈ సర్వేలో వెల్లడైన వివరాలన్నీ నిజమే అయినా… షుగరీ డ్రింక్స్ తాగే వాళ్లందరికీ కేన్సర్ వస్తుందని కాదు. రోజులో తీసుకునే చక్కెర మోతాదును తగ్గించుకుంటూ… కొన్నాళ్లకు ఆ అలవాటును పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికి మంచిది. టీ, కాఫీల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు ఒకటి, రెండుసార్లే తాగుతూ… అందులో చక్కెరను తక్కువ వేసుకోవాలి. అలాగే ఏ పండులో తక్కువ చక్కెరశాతం ఉంటుందో తెలుసుకుని… దాని జ్యూస్ తాగాలి. బయట దొరికే సోడా, కార్బొనేటెడ్ డ్రింక్స్, మద్యానికి దూరంగా ఉండాలి. కేవలం షుగరీ డ్రింక్స్ తాగడం వల్లే కేన్సర్ వస్తుందని ఎక్కడా నిర్ధారణ కాలేదు.
చక్కెరతో ఒబెసిటీ..!
పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా చక్కెరను మోతాదుకు మించి తీసుకుంటే ఒబెసిటీ వస్తుందంటున్నారు నిపుణులు. తాజా పండ్లు, కూరగాయల్లోనూ చక్కెర ఉంటుంది. వాటిని నేరుగా తీసుకోకుండా… పండ్ల రసాల్లో అదనంగా చక్కెర కలిపి తీసుకోవడమే ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఉదాహరణకు… తాజా పండ్ల గుజ్జులో చక్కెర కలపడం, మార్కెట్లో దొరికే కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగడం ఈ మధ్య అందరికీ అలవాటైంది. అయితే ఏది తీసుకున్నా లిమిట్లో ఉండాలి. లేదంటే అది అధిక బరువు (ఒబెసిటీ)కి దారి తీస్తుంది. దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు రావొచ్చు.