రెండు స్థానాలనుంచి పోటీ చేస్తా: నవీన్‌ పట్నాయక్‌

రెండు స్థానాలనుంచి పోటీ చేస్తా: నవీన్‌ పట్నాయక్‌

BJD అధినేత, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలనుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. తన స్వస్థలమైన హింజిలి నుంచి, బిజెపూర్‌ నుంచి నవీన్‌ పట్నాయక్‌ పోటీ చేయనున్నారు. 21 లోక్‌సభ స్థానాలకుగాను 9 స్థానాలకు, 147 అసెంబ్లీ స్థానాలకుగాను 54 స్థానాలకు అభ్యర్థులను నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. వరుసగా ఐదవసారి ఎన్నికల్లో పోటీ చేయనున్న నవీన్‌ పట్నాయక్‌ గంజాం జిల్లాలోని హింజిలినుంచి బార్గఢ్‌ జిల్లాలోని బిజెపూర్‌నుంచి పోటీ చేయనున్నారు.

ఏకకాలంలో అసెంబ్లీ, లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికలు నాలుగు దశల్లో జరగనున్నాయి. బిజెపూర్‌, హింజిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 18న రెండవ దశలో ఎన్నికలు జరగనున్నాయి. రైతులు, మహిళలు, విద్యార్ధులు కోరడంతో బిజెపూర్‌ నుండి పోటీ చేస్తున్నట్లు నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. అయితే 2017 పంచాయతి ఎన్నికల్లో పశ్చిమ ఒడిశాలో బిజెపి మెరుగైన పనితీరును ప్రదర్శించడంతో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పశ్చిమ ఒడిశాను చాలా సార్లు సందర్శించడంతో సీఎం తన పట్టు నిలుపుకునేందుకు అక్కడి నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.