
బూర్గంపహాడ్, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో ప్రమాదవశాత్తు కాంట్రాక్టు కార్మికుడు చనిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. దుమ్ముగూడెం మండలం పెద్ద కమలాపురానికి చెందిన హరీశ్(25) సారపాక గాంధీనగర్లో ఉంటూ ఐటీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. గురువారం పీఎం-7 విభాగంలోని రూప్ షీట్ రేకులు వర్షానికి కారుతుండగా, వాటిని లైఫ్ లైన్ తాడు సాయంతో రిపేర్లు చేస్తున్నాదు. ఈ క్రమంలో నడుముకు ఉన్న బెల్ట్ ఊడిపోవడంతో ప్రమాదవశాత్తు కిందపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన హరీశ్ను తోటి కార్మికులు అంబులెన్స్ లో భద్రాచలం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడు పద్మ ఇన్సూలేషన్ కంపెనీ కాంట్రాక్టర్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఫ్యాక్టరీలో కార్మికుల భద్రతను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు.