సిస్టమ్ మారినా.. అక్రమాలు ఆగలే..

సిస్టమ్ మారినా.. అక్రమాలు ఆగలే..
  • జిల్లా, ప్రాజెక్టుల వారీ టెండర్ల స్థానం జోనల్ విధానం
  • అయినా ఆగని అవినీతి, అక్రమాలు
  • రూల్స్ పాటించకుండా చిన్న సైజ్ గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు

మంచిర్యాల, వెలుగు: అంగన్​వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన కోడి గుడ్లను కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు స్వాహా చేసేస్తున్నారు. రూల్స్​కు విరుద్ధంగా చిన్న సైజు గుడ్లను సప్లై చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అక్రమాలను అరికట్టేందుకు బీఆర్​ఎస్​సర్కార్ గతంలోనే జోనల్​టెండర్ సిస్టమ్ ను తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది.

గతంలో ఉన్న జిల్లా టెండర్​విధానం ద్వారా చిన్న కాంట్రాక్టర్లు లాభపడగా, ఇప్పుడు వారితో పాటు జోనల్  స్థాయిలోని పెద్ద కాంట్రాక్టర్లు సైతం జేబులు నింపుకుంటున్నారు. కొంత మంది ఆఫీసర్లకు ముడుపుల ఆశచూపి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. 

54.25 కోట్ల ఎగ్స్​కు టెండర్లు

అంగన్​వాడీ సెంటర్లకు ఎగ్స్ సప్లై చేసేందుకు గతంలో జిల్లా స్థాయిలో ఐసీడీఎస్​ప్రాజెక్టుల వారీగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ (డీడబ్ల్యూవో) ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించేవారు. కాంట్రాక్టర్లు అగ్​మార్క్​ ప్రమాణాలను పాటించకుండా నాసిరకమైన, చిన్న సైజు ఎగ్స్​సప్లై చేసేవారు. 45 నుంచి 52 గ్రాముల బరువు ఉన్న ఎగ్స్ సప్లై చేయాల్సి ఉండగా, 30 నుంచి 35 గ్రాముల బరువైన ఎగ్స్ ను ఇస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ అక్రమాలను అరికట్టేందుకు బీఆర్​ఎస్​ సర్కార్ జోనల్​టెండర్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. గతేడాది జనవరిలో టెండర్లు పిలువగా వాటిని రద్దు చేయాలంటూ పాత కాంట్రాక్టర్లు హైకోర్టులో కేసు వేశారు. చివరకు మే నెల నుంచి జోనల్​టెండర్​విధానం అమల్లోకి వచ్చింది. రెండేండ్ల కాలపరిమితితో రాష్ట్రంలోని ఏడు జోన్లకు కలిపి 54.25 కోట్ల ఎగ్స్ సప్లైకి ఆర్డర్​ఇచ్చారు.

ఆగని అక్రమాలు

జోనల్ టెండర్​విధానంలో పౌల్ట్రీ ఫామ్స్ నిర్వాహకులు టెండర్​లో 40 శాతం ఎగ్స్​ఉత్పత్తి కెపాసిటీని కలిగి ఉండి, మిగతా 60 శాతం ఎగ్స్ ను బయట కొనుగోలు చేసి సప్లై చేయవచ్చు. అగ్​మార్క్​నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ 45 నుంచి 52 గ్రాముల బరువున్న నాణ్యమైన ఎగ్స్ ను మాత్రమే సప్లై చేయాలి. కానీ జోనల్​టెండర్లు దక్కించుకున్న బడా వ్యక్తులు తిరిగి పాత వారికే సబ్​కాంట్రాక్ట్​అప్పగించారు. దీంతో గతంలో మాదిరిగానే అక్రమాలు కొనసాగుతున్నాయి. మార్కెట్​లో సగం రేటుకే దొరికే చిన్న సైజు గుడ్లను కొనుగోలు చేసి అంగన్​వాడీ సెంటర్లకు సప్లై చేస్తున్నారు. ఈ దోపిడీలో జోనల్ టెండరుదారులు, సబ్​కాంట్రాక్టర్లు, అధికారులు వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటీవల మంచిర్యాల కలెక్టర్​బదావత్​సంతోష్ జైపూర్ మండలంలోని పలు అంగన్​వాడీ సెంటర్లను తనిఖీ చేసి చిన్న సైజు గుడ్లను గుర్తించారు. కలెక్టర్​ఆదేశాలతో డీడబ్ల్యూవో చిన్నయ్య జిల్లాలోని నలుగురు సీడీపీవోలతో పాటు జోనల్​టెండర్ కాంట్రాక్టర్ రజిత, పౌల్ట్రీ నిర్వాహకులకు మెమోలు జారీ చేశారు. ఒక్క జైపూర్​మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నాసిరకం గుడ్లు సప్లై చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

అవినీతి, పర్యవేక్షణ లోపంతోనే....  

అంగన్​వాడీ సెంటర్లపై ఆఫీసర్ల పర్యవేక్షణ లోపించడంతో పాటు కొందరు ఆఫీసర్ల అవినీతి వల్లే కాంట్రాక్టర్లు యథేచ్ఛగా చిన్న సైజు గుడ్లను సప్లై చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు నెలలో రెండు బ్యాచ్​లుగా ఎగ్స్ సప్లై చేస్తారు. చిన్న సైజు, నాసిరకం గుడ్లు వేసినప్పుడు వాటిని అంగన్​వాడీ టీచర్లు తిరస్కరించాలి. కానీ కొంతమంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వాళ్లు ఏవి ఇస్తే అవే తీసుకుంటున్నారు. అంగన్​వాడీ సెంటర్లను పర్యవేక్షించాల్సిన సూపర్​వైజర్లు, వారిపైన ఉండే సీడీపీవోలు సైతం ముడుపులకు ఆశపడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి క్వాలిటీ ఎగ్స్​సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.