- ఇప్పుడు మరింత పెరిగే అవకాశం
- మక్క సాగును ప్రోత్సహించాలంటున్న ఎక్స్పర్టులు
- పంట కొనుగోలు చేయాలని సూచనలు
- మార్క్ఫెడ్ నిల్వలన్నీ ఎప్పుడో అమ్మేసిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: యాసంగిలో వరి వేయొద్దని సర్కారు చెబుతుండటంతో ఇతర పంటలపై రైతులు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మక్కలు సాగు చేయాలని భావిస్తున్నారు. అగ్రి ఎక్స్పర్టులు కూడా వరికి ఆల్టర్నేటివ్ మక్కలేనని చెప్తున్నారు. యాసంగిలో రైతులు మొక్కజొన్నలు వేసేలా ప్రోత్సహించాలని, పండిన పంటను కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు. నిరుడు ఈ సీజన్లో 68.14 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. యాసంగిలో వరి సాధార ణ సాగు విస్తీర్ణం 31.01 లక్షల ఎకరాలు కాగా, నిరుడు రికార్డు స్థాయిలో ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ సీజన్లో వరి వేయొద్దని సర్కారు స్పష్టం చేయడంతో ఇంత భారీ స్థాయిలో ఏయే ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే దానిపై చర్చ నడుస్తోంది. యాసంగి సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలు. నిరుడు వానాకాలం నుంచే మక్కలు వద్దని రాష్ట్ర సర్కారు చెప్పింది. అయినా గత యాసంగిలో 4.66 లక్షల ఎకరాల్లో మక్కలు వేశారు. ఈయేడు మక్కలపై రాష్ట్ర సర్కారు స్పందించలేదు. వానాకాలం పంటను ప్రైవేటు వ్యాపారులే కొన్నారు. నిరుడు వానాకాలంలో మార్క్ఫెడ్ సేకరించిన మక్కలను సర్కారు పూర్తిగా అమ్మేసింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద మక్కల నిల్వలు లేవు. దీంతో ఇప్పుడు మక్క సాగును విస్తరిస్తే రైతులకు మేలు జరుగుతుందనే వాదనలు ఉన్నాయి. రాష్ట్రంలో మక్కలను ప్రోత్సహించే అవకాశాలు ఉన్నా ఆ వైపు దృష్టి పెట్టలేదనే విమర్శ ఉంది. సర్కారు ప్రోత్సహిస్తే రాష్ట్రంలో మెక్కజొన్న సాగు విస్తీర్ణాన్ని దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల వరకు పెంచుకునే అవకాశం ఉందని ఎక్స్పర్టులు అంటున్నారు.
నేలలూ అనుకూలం
తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోనూ మొక్కజొన్న సాగుకు అనుకూలమే. యాసంగిలో తక్కువ టైమ్లో ఎక్కువ దిగుబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీరు ఇంకే నల్లరేగడి, నీటి వసతివున్న ఎర్రనేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో మొక్కజొన్న సాగు చేయొచ్చు. ఎకరా వరిసాగుకు అవసరమయ్యే నీటితో రెండు ఎకరాల మొక్కజొన్న సాగుచేయవచ్చు. ప్రధానంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, నర్సంపేట్, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో మక్క సాగు జరుగుతోంది. దీన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంటుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. యాసంగిలో జనవరి 15 దాకా విత్తనాలు వేసుకోవచ్చని వ్యవసాయ వర్సిటీ ఎక్స్పర్టులు చెబుతున్నారు. కంది, పెసర, మినుములు, వేరుశనగ, క్యారెట్, ముల్లంగి, పొద్దు తిరుగుడు తదితర పంటలతో కలిపి సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. దోసకాయ, గోంగూర, బెండకాయ, వంకాయ వంటి కూరగాయలతోకూడా అంతరాపంటగా సాగు చేసుకోవచ్చు.
ఉపయోగాలు ఎక్కువే
మొక్కజొన్న ఆహార పంటగానే కాకుండా పశువుల మేతగా, పరిశ్రమల్లో ముడిసరుకుగా, పేలాల పంటగా, కాయగూర రకంగా సాగుచేస్తారు. మక్క ఆకులు, కాండాన్ని సైలేజీగా, పేపరు తయారీలో, ప్యాకింగ్తోపాటు పరిశ్రమల్లో ముడిసరుకు ఉపయోగిస్తారు. ఆహారంగా, పశువుల, కోళ్ల దాణా, బిస్కట్లు, బేకరీ పదార్థాల తయారీలో వాడుతారు. గింజల నుంచి స్టార్చ్, గ్లూకోస్, సుక్రోస్, డెక్త్రీన్స్ సెల్యులోస్, గమ్స్ తయారు చేస్తారు. గింజల నుంచి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారు చేస్తారు. బేకింగ్ పౌడర్ల తయారీలో, విస్కీ తయారీలోనూ, ఇతర ఉత్పత్తుల్లో మక్కలు ఉపయోగపడుతాయని ఎక్స్పర్ట్స్ అంటున్నరు.
మద్దతు ధరతో మక్కలు కొనాలి
మక్కలపై సర్కారు దృష్టి పెట్టడం లేదు. యాసంగిలో ఎక్కువ దిగుబడి వచ్చే మక్కలను ప్రోత్సహించి, కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతుంది. నిరుడు యాసంగి నుంచి ప్రభుత్వం మక్కలు కొంటలేదు. మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరతో మక్కలు కొనాలి.
- మూడ్ శోభన్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి
కొనుగోలు బాధ్యత నుంచి తప్పుకుంటున్నది
కేంద్రం మీద కొనుగోలు భారం వేసి.. తన బాధ్యత నుంచి తప్పించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పత్తి, కంది, మినుములు సహా అన్ని కేంద్రం కొనే పంటలే సీఎం కేసీఆర్ వేయమంటున్నడు. రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సి వస్తుందనే కారణంతో మక్క పంట వద్దంటూ రైతులను నిరుత్సాహపరుస్తున్నరు.
- ప్రొఫెసర్ జలపతిరావు, అగ్రి ఎక్స్పర్ట్