తెలంగాణలో 2 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో 2 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతుంది. తాజాగా బుధవారం ఒక్కరోజే తెలంగాణలో కరోనా కేసులు రెండు వేలు దాటాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా 2055 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,704కు చేరింది. కరోనాతో బుధవారం ఏడుగురు మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,741కు చేరింది. కరోనా బారినపడిన వారిలో బుధవారం 303 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారిసంఖ్య 3,03,601గా రికార్డయింది.

కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 13,362 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. వారిలో 8,263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 87,332 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1,06,59,953 మందికి కరోనా పరీక్షలు చేశారు.